భరతమాతకు క్షీరాభిషేకం: శాతవాహన యూనివర్సిటీలో అసలేం జరిగింది?
కరీంనగర్: శాతవాహన విశ్వవిద్యాలయం వద్ద రెండు రోజుల క్రితం చోటు చేసుకున్న పరిణామాలు చర్చకు దారి తీశాయి. ఇరువర్గాలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నందున పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అదుపులోకి తెచ్చారు. వర్సిటీకి నిరవధిక సెలవులు ప్రకటించడంతో కళాశాలలు మూసివేసి తాళాలు వేశారు. ప్రాంగణాలు వెలవెలపోతున్నాయి.
కళాశాల వైపు ఎవరూ రాకుండా భద్రతా సిబ్బంది కాపలా ఉన్నారు. పోలీసులు పికెటింగ్ నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రే కాలేజీ, హాస్టల్, మెస్లు మూసేశారు. దీంతో చాలామంది రాత్రే ఖాళీ చేసి వెళ్లిపోయారు. పరీక్షలు వాయిదా వేశారు. తేదీలను తర్వాత ప్రకటించనున్నారు.
అసలేం జరిగింది?
శాతవాహన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అసలేం జరిగిందనే చర్చ సాగుతోంది. యూనివర్సిటీలోని వామపక్ష విద్యార్థి సంఘాల ఆద్వర్యంలో మనుధర్మ శాస్త్ర ప్రతులను దహనం చేశారు. దీంతో పాటు అక్కడే పక్కనే భరతమాత చిత్రాలు ఉన్నాయి. దానిని కూడా దగ్ధం చేసే ప్రయత్నాలు లేదా దగ్ధం చేయడం జరిగిందని చెబుతున్నారు. అదే సమయంలో అక్కడకు వాజపేయీ జన్మదిన ఉత్సవాలు జరిపేందుకు బీజేవైఎం, ఏబీవీపీ కార్యకర్తలు వచ్చారు.
భరతమాత దగ్ధం చేసే ప్రయత్నమే వివాదానికి కారణమా?
భరతమాత చిత్రపటాన్ని దగ్ధం చేసే ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఆ సమయంలో భరతమాత చిత్రపటాన్ని దగ్ధాన్ని ఆపేందుకు ప్రయత్నించిన వారిపై మొదట దాడి జరిగిందని చెబుతున్నారు. దీంతో ప్రతి దాడి జరిగి, ఇరువర్గాలు రాళ్లు రువ్వుకునే వరకు వెళ్లింది. మనుస్మృతితో పాటు భరతమాత చిత్రపటాన్ని దగ్ధం చేసే ప్రయత్నమే గొడవకు కారణంగా చెబుతున్నారు.
వారిని అరెస్ట్ చేసి దేశద్రోహం కేసు పెట్టాలి
భరతమాత చిత్రాన్ని దగ్ధం చేసిన వామపక్ష విద్యార్థి సంఘాల తీరును నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు మంగళవారం తిమ్మాపూర్ మండలంలోని అల్గునూరు కూడలి వద్ద నిరసన వ్యక్తం చేశారు. భరతమాత చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. భరతమాత చిత్రపటాన్ని దహనం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
భరతమాత చిత్రపటాన్ని దగ్ధం చేయడమా?
మనుస్మృతితో పాటు పక్కనే ఉన్న భరతమాత ఫ్లెక్సీని తగులబెట్టడానికి ప్రయత్నించడం లేదా తగులబెట్టడమే గొడవ ఇంత పెద్దగా కావడానికి కారణంగా కనిపిస్తోందని స్థానికంగా కూడా చర్చించుకుంటున్నారు. భరతమాత చిత్రపటాన్ని దగ్ధం చేయడం దారుణమైన తప్పు అని మండిపడుతున్నారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.
వీరేమన్నారంటే
ఈ సంఘటనపై వేర్వేరుగా శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి, సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డిలు స్పందించారు. శాతవాహన వర్సిటీలో వామపక్ష విద్యార్థి సంఘాలపై ఏబీవీపీ కార్యకర్తల దాడులు హేయమని వ్యాఖ్యానించారు. అసలు వర్సిటీలో పుస్తకాలు తగులబెట్టడం ఏమిటని, ఈ తరహా విధానాన్ని ప్రోత్సహించడం విడ్డూరమని, బుర్ర లేని వారే పుస్తకాన్ని తగులబెడతారని పరిపూర్ణానంద స్వామి అన్నారు.