వరంగల్ బిజెపికే: బాబుతో విబేధించిన టి టిడిపి, ఏంటిది.. రేవంత్-ఎర్రబెల్లిలపై అసహనం
విజయవాడ/వరంగల్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో ఆ పార్టీకి చెందిన తెలంగాణ నేతలు విభేదించారు! వరంగల్ ఉప ఎన్నికలలో పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెడతామని పార్టీ నేతలు అన్నారు. దీనికి చంద్రబాబు ససేమీరా అన్నారు.
వరంగల్ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిని నిలబెడదామని ఆయన తెలంగాణ పార్టీ నేతలకు సూచించారు. మంగళవారం నాడు పలువురు టిటిడిపి నేతలు విజయవాడలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వరంగల్ ఉప ఎన్నిక అంశంపై వారు చర్చించారు.
ఈ ఉప ఎన్నిక పైన గంటల పాటు చర్చించారు. వరంగల్ ఉప ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థినే నిలబెడతామని, తద్వారా పార్టీ పుంజుకుంటుందని తెలంగాణ టిడిపి నేతలు కోరారు. దీనికి చంద్రబాబు ససేమీరా అన్నారు. గత ఎన్నికల్లో బిజెపికి సీటు కేటాయించామని, ఇప్పుడు కూడా అలాగే ఇద్దామని చెప్పారు.
అయితే, పార్టీ తరఫున బిజెపి అభ్యర్థి గెలుపు కోసం గట్టిగా శ్రమించాలని బాబు వారికి సూచించారు. బిజెపికే పోటీ చేసే అవకాశం ఇస్తామని చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో... కమలం పార్టీ అభ్యర్థి బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిజెపి అభ్యర్థిని ప్రకటించవలసి ఉంది.
వేర్వేరుగా ఎర్రబెల్లి, రేవంత్ భేటీ
వరంగల్ ఉప ఎన్నికతో పాటు రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, రేవంత్ రెడ్డి - ఎర్రబెల్లి దయాకర రావుల మధ్య గొడవ అంశం చంద్రబాబు వద్ద చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా చంద్రబాబు ఇరువురు నేతలకు క్లాస్ పీకారు. అందరు నేతలు కలిసి ఓసారి, ఆ తర్వాత వేర్వేరుగా బాబుతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి, రేవంత్లు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. గొడవపై ఎవరికి వారు వివరణ ఇచ్చుకున్నారు. దీనిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.
నేతల మధ్య విభేదాలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయన్నారు. ఇలాంటి వివాదాలతోనే పలువురు పార్టీని వీడుతున్నారని అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. విజయవాడలో తెలంగాణ అంశాలు... వరంగల్ ఉప ఎన్నిక, రేవంత్ రెడ్డి - ఎర్రబెల్లి గొడవ అంశం పైన హాట్ హాట్గా చర్చ సాగింది.