అమిత్ షా వ్యూహం: కోమటిరెడ్డి సహా ఆ వర్గానికి గాలం, కెసిఆర్కు షాక్
తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం కావడానికి బిజెపి ప్రయత్నిస్తోంది.ఈ మేరకు తెలంగాణలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన బలమైన నాయకులను తమ పార్టీలో చేర్చుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం కావడానికి బిజెపి ప్రయత్నిస్తోంది.ఈ మేరకు తెలంగాణలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన బలమైన నాయకులను తమ పార్టీలో చేర్చుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులతో ఆ పార్టీ నాయకులు చర్చిస్తున్నారు. కోమటిరెడ్డి సోదరులతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులతో, నాయకులతో బిజెపి నాయకులు చర్చిస్తున్నారు.
తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు 2019 ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టే దిశగా బిజెపి పావులు కదుపుతోంది.ఈ మేరకు ఆ పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఇతర పార్టీలకు చెందిన పలువురు బలమైన నాయకులను తమ పార్టీలో చేర్చుకొనేందుకు ప్రయత్నాలను సాగిస్తోంది.
ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన రెడ్డి సామాజికవర్గానికి చెందిన నాయకులతో బిజెపి సంప్రదింపులు జరుపుతోంది. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన సందర్భంగా ఒకరిద్దరూ నాయకులు బిజెపిలో చేరేలా పార్టీ ప్లాన్ చేస్తోంది.
తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న బలమైన నాయకులతో బిజెపి చర్చలు సాగిస్తోంది. అంతేకాదు సామాజిక సమీకరణాలను కూడ దృష్టిలో పెట్టుకొంది. ఆయా పార్టీలకు చెందిన నాయకులు తమ పార్టీలో చేరడం వల్ల ఏ మేరకు పార్టీకి ప్రయోజనమనే విషయమై బేరీజు వేసుకొంటుంది.
కాంగ్రెస్ నేతలతో బిజెపి సంప్రదింపులు
కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన బలమైన నాయకులను తమ పార్టీలోకి చేర్చుకొనేందుకు బిజెపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులతో బిజెపి నాయకులు చర్చిస్తున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి సోదరులు, గద్వాల జిల్లా నుండి మాజీ మంత్రి డికె అరుణ, రంగారెడ్డి జిల్లా నుండి సబితా ఇంద్రారెడ్డి, మెదక్ జిల్లా నుండి సునీత లక్ష్మారెడ్డిలతో పాటు నిజామాబాద్ కు చెందిన సుదర్శన్ రెడ్డి, కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి శ్రీధర్ బాబులతో చర్చిస్తున్నారు.అయతే ఇంకా పార్టీలో చేరే విషయాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు మాత్రం స్పష్టం చేయలేదు.
రెడ్డి సామాజికవర్గంపైనే కేంద్రీకరణ ఎందుకంటే?
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వంలో రెడ్డి సామాజికవర్గానికి ప్రాధాన్యత లేదనే అభిప్రాయం ఉంది. తెలంగాణలో రెడ్డి సామాజికవర్గం బలంగా ఉంటుంది,అంతేకాదు అధికారానికి ఈ సామాజికవర్గం దూరంగా ఉంది. దీనికితోడు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ రెడ్డి సామాజికవర్గంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భావన ఆ సామాజికవర్గంలో ఉంది. కొన్ని సందర్భాల్లో ఈ విషయాన్ని కొందరు రాజకీయనాయకులు ప్రస్తావించారు కూడ. రెడ్డి సామాజికవర్గాన్ని లక్ష్యంగా చేసుకొని టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను రాజకీయవిశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు.అయితే ఈ తరుణంలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులపై బిజెపి కేంద్రీకరించింది. రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలను తమ పార్టీలో చేర్చుకొంటే పార్టీ బలోపేతమయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయని ఆపార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
బిజెపిలోకి కోమటిరెడ్డి సోదరులు, కెసిఆర్ అందుకే వద్దన్నారా?
రెండేళ్ళ క్రితం వరకు టిఆర్ఎస్ లో చేరుతారని కోమటిరెడ్డి సోదరులపై విస్తృతంగా ప్రచారం సాగింది.అయితే ఈ విషయమై టిఆర్ఎస్ నాయకత్వం కోమటిరెడ్డి సోదరులతో చర్చలు జరిపారనే ప్రచారం కూడ సాగింది.అయితే మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్థానంలో మంత్రిపదవిని ఇవ్వాలనే షరతు విధించినందున ఈ చర్చలు ముందుకుసాగలేదు. ఈ తరుణంలోనే నల్గొండ ఎంపి గుత్తాసుఖేందర్ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చింది టిఆర్ఎస్. ఇదిలా ఉంటే ప్రస్తుతం బిజెపి నాయకులు కోమటిరెడ్డి సోదరులతో చర్చలు సాగిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే పాత నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు నాలుగు అసెంబ్లీ స్థానాలను కోమటిరెడ్డి సోదరులు సూచించే వ్యక్తులకు టిక్కెట్లు కేటాయించేందుకు బిజెపి సుముఖంగా ఉంది. అయితే ఈ ఆఫర్ విషయమై కోమటిరెడ్డి సోదరుల నుండి ఇంకా బిజెపి నాయకత్వానికి స్పష్టత రావాల్సి ఉంది.
కోమటిరెడ్డి బ్రదర్స్ తీరుతో విసిగిన జిల్లా నాయకులు
నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి సోదరుల రాజకీయంతో అదే జిల్లా నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇబ్బందిపడుతున్నారు. వారి తీరుపట్ల విసుగు చెందుతున్నారని పలు ఘటనలను రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు.పాత నల్లగొండ జిల్లా నుండే ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి , రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పాల్వాయి గోవర్థన్ రెడ్డిలు ప్రాతినిథ్యం వహిస్తున్నరాు. అయితే కోమటిరెడ్డి సోదరుల తీరు పట్ల అభ్యంతరాలను వ్యక్తం చేశారు.
పీసీపీ చీఫ్ పదవి ఇచ్చేందుకు రాహుల్ విముఖత
కోమటిరెడ్డి సోదరులకు పీసీసీ నాయకత్వ బాధ్యతలను ఇచ్చేందుకుగాను కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అంతగా ఆసక్తి చూపలేదని సమాచారం. ఈ మేరకు రాహుల్ గాంధీని కోమటిరెడ్డి సోదరులు కలిసి ఈ విషయమై విన్నవించారని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను తమకు అప్పగిస్త పార్టీని విజయపథంలోకి తీసుకెళ్ళనున్నట్టు చెప్పారు.అయితే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం ఈ విషయమై హమీ ఇవ్వలేదు. దీంతో కోమటిరెడ్డి సోదరులు బిజెపివైపు చూస్తున్నారని సమాచారం.
మాజీ మంత్రులకు బిజెపి వల
కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతలతో పాటు, మాజీ మంత్రులకు బిజెపి గాలం వేస్తోంది. జిల్లాల వారీగా సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని బిజెపి ఈ ప్లాన్ చేస్తోంది. గద్వాల జిల్లాకు చెందిన మాజీ మంత్రి డికె అరుణ, రంగారెడ్డి జిల్లా నుండి సబితా ఇంద్రారెడ్డి, మెదక్ జిల్లా నుండి సునీతా లక్ష్మారెడ్డి, నిజామాబాద్ జిల్లా నుండి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, కరీంనగర్ జిల్లా నుండి శ్రీధర్ బాబులపై పార్టీలో చేరే విషయమై బిజెపి గాలం వేస్తోంది. క్షేత్రస్థాయిలో ఆయా నేతలకు ఉన్న పట్టుతో పాటు ఇతర నియోజకవర్గాల్లో ఆ పార్టీ నాయకుల ప్రభావం ఏ మేరకు పనిచేస్తోందనే విషయాలపై బిజెపి నాయకులు సర్వే నిర్వహిస్తున్నారు.
లోక్ సభ, రెండు అసెంబ్లీ స్థానాల ఆఫర్
పార్టీ మారి బిజెపిలో చేరే నాయకులకు బిజెపి బంపర్ ఆఫర్లను ప్రకటిస్తోంది. ఒక్క పార్లమెంట్ స్థానంతో పాటు రెండు అసెంబ్లీ స్థానాలను ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకొంది. అయితే ఆయా నాయకులకు ఉన్న బలం ఆధారంగా ఈ స్థానాల సంఖ్య ఆధారపడి ఉంటుందని బిజెపి నాయకత్వం చెబుతోంది.అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఒకరు తన అనుచరులతో సమావేశాన్ని నిర్వహించారు.రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఆయన చర్చించారు. భవిష్యత్ కార్చాచరణపై కూడ చర్చించారని సమాచారం.
కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు సాగుతాయి
అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు బిజెపిలో చేరే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.అయితే పార్టీలో చేరేందుకు ఆసక్తిని చూపుతున్న నాయకులతో తమ పార్టీ నాయకులు సంప్రదింపులను కొనసాగిస్తూనే ఉంటారని బిజెపి రాష్ట్రనాయకుడొకరు చెప్పారు.
నేను బలమున్న నాయకురాలినేనని గుర్తించారు
తాను కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపిలో చేరుతానని వార్తలను మాజీ మంత్రి డికె అరుణ సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. గతంలో తాను టిఆర్ఎస్ లో చేరుతానని ప్రచారం సాగిందని ఆమె గుర్తు చేశారు. అయితే ఈ పుకార్ల పట్ల తన దృష్టికి కూడ వచ్చిందని ఆమె తన సన్నిహితులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఒకరోజు టిఆర్ఎస్ , మరో రోజు బిజెపిలో చేరుతారని ప్రచారం సాగుతోన్న విషయాలను ఆమె సన్నిహితుల వద్ద ప్రస్తావించారు. అయితే తాను బలమైన నాయకురాలినని గుర్తించినందుకు ధన్యవాదాలంటూ ఆమె సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు.