అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు, బీజేపీని ఓడిస్తారా?: కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీలపై లక్ష్మణ్, మురళీధర
హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. వచ్చే 20ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బీజేపీ మేనిఫెస్టో రూపకల్పన చేస్తున్నామని తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు.
బాబ్లీ కేసు: చంద్రబాబుకు త్వరలో కోర్టు నోటీసులు!, ఏపీ ముందస్తుపై లోకేష్ ఏమన్నారంటే?
ఈ ఇద్దరు నేతలు వేర్వేరుగా మాట్లాడుతూ.. టీఆర్ఎస్, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలపై విమర్శలు గుప్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పించేందుకు సమాలోచనలు చేస్తున్నామని పేర్కొన్నారు.
15నుంచే ఎన్నికల శంఖారావం
సెప్టెంబర్ 15న పాలమూరు నిర్వహించే బహిరంగ సభకు జాతీయ అధ్యక్షుడు అమిత్ రానున్నట్లు లక్ష్మణ్ చెప్పారు. ఈ బహిరంగ సభ నుంచే అమిత్ షా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నట్లు తెలిపారు. కేసీఆర్ విభిన్న వర్గాలకు తాయిలాలు ప్రకటించి విస్మరించారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్కు ఓటేస్తే మజ్లిస్కే ఓటేసినట్లని లక్ష్మణ్ అన్నారు. తెలంగాణలో గల్లంతైన టీడీపీ.. బీజేపీని ఓడిస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు.
నేతల మార్పు.. కాంగ్రెస్, టీఆర్ఎస్లపై సెటైర్లు
కాగా, తెలంగాణలోని 119 స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలబెడతామన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు. మహబూబ్నగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన... తెలంగాణలో బీజేపీ ఎన్నికలకు సిద్ధంగా ఉందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారాలకే పరిమితమైందన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్లు రెండూ కుటుంబపాలన పార్టీలేనని సెటైర్లు వేసిన మురళీధర్రావు... ఈ రెండు పార్టీలు నేతలను మార్చుకుంటూ ఉంటాయని ఎద్దేవా చేశారు.
టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం..
ఎలాంటి పక్షపాతం లేకుండా తెలంగాణ అభివృద్ధికి బీజేపీ సహకరించిందని మురళీధర్ రావు అన్నారు. రానున్న ఎన్నికల్లో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్ర్రూమ్, నిరుద్యోగం వంటి అంశాలపై ప్రధానంగా ప్రచారం చేస్తామన్నారు. సెప్టెంబర్ 15న మహబూబ్ నగర్ లో అమిత్ షా సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ అభివృద్ధికి ఆటంకం, అవినీతికి అడ్రస్ అంటూ మండిపడ్డారు. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ కాదని.. బీజేపీనేనని అన్నారు.
తెలంగాణకు అమిత్ షా.. ఎన్నికల ప్రచారం షురూ
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సెప్టెంబర్ 15న తెలంగాణలో పర్యటించనున్నారు. ఆయన ఎన్నికల వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. పర్యటనలో భాగంగా శక్తి కేంద్ర ప్రముఖులతో అమిత్ షా సమావేశం అవుతారు. అనంతరం ఆఫీస్ బేరర్స్, జిల్లా ఇంఛార్జ్లు, అధ్యక్షులతో ఆయన భేటీ కానున్నారు. 15వ తేదీ మధ్యాహ్నం మహాబూబ్నగర్లో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. సెప్టెంబర్ 29న కరీంనగర్లో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. అమిత్ షా రాక బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతుందని నేతలు భావిస్తున్నారు.