'హైదరాబాద్' ఎఫెక్ట్: టిడిపికి మరో షాక్, బాబుకు బిజెపి గుడ్బై!
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ గుడ్ బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రాంత బిజెపి నేతలు గురువారం భేటీ అయ్యారు. టిడిపితో పొత్తు వద్దని ఢిల్లీ పెద్దలకు చెప్పాలని ఈ భేటీలో చర్చిస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల సమయం నుంచి తెలంగాణ బిజెపి నేతలు టిడిపితో పొత్తుకు సిద్ధంగా లేరు. ఇదే విషయం జాతీయ అధ్యక్షులు అమిత్ షాతో చెప్పినప్పటికీ అప్పుడు ప్రయోజనం లేకుండా పోయింది. ఆ తర్వాత తెలంగాణలో వరుస ఎన్నికలు, ఉప ఎన్నికల్లో టిడిపి - బిజెపి కూటమి ఘోరంగా దెబ్బతింది.
Photos: చంద్రబాబు శంకుస్థాపన
వరంగల్ ఉప ఎన్నికల్లో, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో, నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో ఈ కూటమికి దారుణమైన షాక్ ఎదురయింది. ఈ నేపథ్యంలో మరోసారి టిడిపితో పొత్తు విషయమై ఢిల్లీ నాయకత్వం దగ్గరకు తీసుకు వెళ్లాలని భావిస్తున్నారు.
ఇందులో భాగంగా గురువారం బిజెపి కార్యాలయంలో కోర్ కమిటీ భేటీ అయింది. టిడిపితో పొత్తు కొనసాగింపు పైన చర్చ జరుగుతోంది. టిడిపితో పొత్తు వద్దని నేతలు అందరూ తీర్మానం చేసి కేంద్ర నాయకత్వానికి పంపనున్నారు. తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఈ తీర్మానం పంపించనున్నారు.
తెలంగాణలో టిడిపికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయనే చెప్పవచ్చు. ఎన్నికల్లో ఓటమి, మరోవైపు సీనియర్ నేతలు కారు ఎక్కుతుండటం, ఇప్పుడు బిజెపి దూరమయ్యేందుకు చూడటం... ఇవన్నీ టిడిపికి షాక్ అనే చెప్పవచ్చు.
ఈ రోజు కార్టూన్
అందుకే...!
తెలంగాణను వ్యతిరేకించిన పార్టీగా ముద్రపడ్డ టిడిపితో ముందుకు సాగితే భవిష్యత్తులో బలోపేతం అటుంచి ఉన్న కార్యకర్తల బలం కూడా తగ్గిపోయే ప్రమాదం ఉందని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో తెలంగాణలో టిడిపితో ఇక పొత్తుకు స్వస్తి పలకాలని బీజేపీ నేతలు ఏకగ్రీవంగా తీర్మానం చేసేందుకు సిద్ధమయ్యారి తెలుస్తోంది.