ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరామర్శ, రాష్ట్రపతికి ఫిర్యాదు : ఇదీ బీజేపీ కార్యాచరణ
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్లక్ష్యంపై తమ ఉద్యమం కొనసాగుతోందని బీజేపీ స్పష్టంచేసింది. ఇటీవల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నిరవధిక నిరహార దీక్ష చేపట్టి విరమించారు. మలిదశ ఉద్యమాన్ని జాతీయస్థాయి వరకు తీసుకెళతామని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.
భరోసా కల్పిస్తాం ..
ఇంటర్ బోర్డు నిర్లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా 26 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆయా కుటుంబ సభ్యులను రేపు, ఎల్లుండి కలిసి పరామర్శిస్తామని లక్ష్మణ్ తెలిపారు. తర్వాత 9,10 తేదీల్లో ఈ అంశంపై కేంద్ర హోంశాఖ, రాష్ట్రపతి, మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. దశలవారీగా ఉద్యమించి .. గ్లోబరీనా, ఇంటర్ బోర్డుపై చర్యలు తీసుకునేవరకు పోరాడుతామని ఆయన స్పష్టంచేశారు.
వాట్ నెక్ట్స్ ..
బోర్డు, గ్లోబరీనా వైఫ్యలాల్యను ఢిల్లీస్థాయిలో ఎండగడుతామని పేర్కొన్నారు. తర్వాత 11, 12 తేదీల్లో అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఒక్కరోజు దీక్ష చేపడుతామని స్పష్టంచేశారు. ఇంటర్ విద్యార్థుల తల్లిదండ్రులతో 15, 16 తేదీల్లో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ కోసం చర్చిస్తామని తెలిపారు
నిర్బందం సరికాదు ..
బోర్డులో జరిగిన అవకతవకలపై తాము శాంతియుతంగా పోరాటం చేస్తున్నామన్నారు లక్ష్మణ్. కానీ ప్రభుత్వం నిర్భదించి నీరుగార్చే కుట్ర చేస్తుందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కూడా అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్, గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వ లాలూచీ పడిందని విమర్శించారు.