తెరముందు కుస్తీ, వెనక దోస్తీ.. బీజేపీ, ఎంఐఎంపై రేవంత్ రెడ్డి నిప్పులు
గ్రేటర్లో పాగా వేసేందుకు ప్రధాన పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. హైదరాబాద్ ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. బల్దియా పోరులో కాంగ్రెస్ పార్టీ కూడా జోరుగా ప్రచారం చేస్తుంది. ఆ పార్టీ నేత రేవంత్ రెడ్డి క్యాంపెయిన్ను భుజాన వేసుకున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. బస్తీ హమారా.. బల్దియా హమారా నినాదంతో ఎన్నికలకు వెళుతున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.
టీఆర్ఎస్ సమన్వయకర్త..
పనిలోపనిగా కేసీఆర్, బండి సంజయ్పై విమర్శలు గుప్పించారు. వారిద్దరూ కలిసి తెలంగాణ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం ఒకే ఎజెండా తో పనిచేస్తున్నాయని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రావడానికి ఎంఐఎం సహకారం అందిస్తోందని.. ఇటీవల జరిగిన ఎన్నికలే దీనికి నిదర్శనం అంటూ ఉదహరించారు. ఆ రెండు పార్టీలకు టీఆర్ఎస్ సమన్వయ కర్తగా పనిచేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు.
తెరముందు.. తెరవెనక
అసదుద్దీన్ జైల్కు వెళితే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బెయిల్ ఇప్పించారని గుర్తు చేశారు. బీజేపీ, ఎంఐఎం తెరముందు కుస్తీ, తెర వెనుక దోస్తీ చేస్తోందన్నారు. కేసీఆర్ ఆత్మ అయిన జూపల్లి రామేశ్వర్ రావ్ మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డారని బీజేపీ ఎంపీ అరవింద్ ఫిర్యాదులు చేశారని తెలిపారు. అయితే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రామేశ్వర్ రావ్, కుమారుడితో కలిసి పార్లమెంట్లో కేంద్ర మైనింగ్ శాఖ మంత్రిని కలిసి చర్యలు తీసుకోకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.
రఘునందన్, కిషన్ రెడ్డిని సస్పెండ్ చేయాలి...?
బీజేపీకి నిజాయితీ ఉంటే.. రఘునందన్ రావ్, కిషన్ రెడ్డిను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అసదుద్దీన్ ఒవైసీ ఫ్రెండ్లీగా ఉన్న వీడియోను మీడియాకు విడుదల చేశారు. ప్రధాని మోడీ విధానాలను మేం తప్పని చెబితే సీఎం కేసీఆర్ వారికి మద్దతు ఇచ్చారన్నారు. హిందుత్వ పార్టీ అని చెప్పుకునే బీజేపీ నేతలు సచివాలయంలో వందేళ్ల చరిత్ర ఉన్న నల్లపోచమ్మ గుడిని కూల్చితే ఎందుకు వెళ్ళలేదని ప్రశ్నించారు. ఈఎస్ఐ, సహారా కుంభకోణాల్లో సీబీఐ కేసుల్లో ఉన్న కేసీఆర్ను బీజేపీ కాపాడుతోందన్నారు.
Recommended Video
నమ్మకం లేదా..?
సంతకాన్ని ఫోర్జరీ చేసారని బండి సంజయ్ అంటున్నారని.. కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నేరుగా ఎందుకు చర్యలు తీసుకోలేదని అడిగారు. బండి సంజయ్కి భాగ్యలక్ష్మి అమ్మవారి మీద ఉన్న నమ్మకం కిషన్ రెడ్డిపై లేదా అని అడిగారు.