అసెంబ్లీ వద్ద రేవంత్ రెడ్డికి చేదు, నేరస్థుడా అని కిషన్ రెడ్డి ఆగ్రహం
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డికి అసెంబ్లీలో గురువారం నాడు చేదు అనుభవం ఎదురైంది. ఆయన అసెంబ్లీలోకి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది.
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డికి అసెంబ్లీలో గురువారం నాడు చేదు అనుభవం ఎదురైంది. ఆయన అసెంబ్లీలోకి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది.
తనను అసెంబ్లీ లోపలకు రాకుండా ఇచ్చిన ఆదేశాల కాపీని చూపించాలని రేవంత్ రెడ్డి నిలదీశారు. తమకు మౌఖిక ఆదేశాలు ఉన్నాయని పోలీసులు చెప్పారు. మౌఖిక ఆదేశాలు చెల్లవని రేవంత్ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు.
రేవంత్ రెడ్డి స్పీకర్ మధుసూదనా చారిని కలిసేందుకు వెళ్తుండగా అడ్డుకున్నారు. అసెంబ్లీ లాబీలోకి వెళ్లకుండా ఆయనను నిలిపివేశారు. దీంతో, అక్కడే ఉన్న బీజేపీ నేత కిషన్ రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి ఏమైనా నేరస్తుడా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల పట్ల ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తారా? అని మండిపడ్డారు. అయితే, చీఫ్ మార్షల్ ఆదేశానుసారమే తాము రేవంత్ను అడ్డుకున్నామని సిబ్బంది తెలిపారు. ఇదే సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. తనను సస్పెండ్ చేసినట్టు మీ దగ్గర ఏమైనా పత్రాలు ఉన్నాయా? అని నిలదీశారు.