కేటీఆర్ను సీఎం చేసేది అప్పుడే... కారణమిదే... : ఎమ్మెల్యే రఘునందన్ రావు
తెలంగాణ ప్రభుత్వంలో మున్ముందు కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయన్న చర్చ జోరందుకుంది. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ త్వరలోనే సీఎం సీట్లో కూర్చోబోతున్నారన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా ఇదే అంశంపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడారు. కేసీఆర్కు ఆరోగ్యం సరిగా లేదని... ఈ కారణంగానే వచ్చే మార్చిలో కుమారుడు కేటీఆర్కు ప్రభుత్వ పగ్గాలు అప్పగించే యోచనలో ఉన్నారని చెప్పారు.
నిజామాబాద్ లో కవితకు, దుబ్బాకలో హరీశ్ రావుకు, జీహెచ్ఎంసీలో కేటీఆర్కు ప్రజలు ఓట్ల ద్వారా బుద్ధి చెప్పారని రఘునందన్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేస్తాయని... ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. 2023 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కాగా,కేసీఆర్ ఇటీవలి ఢిల్లీ పర్యటన తర్వాత పూర్తిగా ఫాంహౌస్కే పరిమితమయ్యారన్న ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత పార్టీ నుంచి గానీ ప్రభుత్వం నుంచి గానీ ఆయన పర్యటనపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు,ఇతరత్రా ప్రయోజనాల గురించే ఆయన కేంద్రంతో చర్చించారని.. అంతకుమించి ఇంకేం ఉంటుందని టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మరోవైపు బీజేపీ నేతలు మాత్రం కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని... ఆయన అవినీతి చిట్టా బీజేపీ అధిష్టానానికి చేరడంతో ఢిల్లీ వెళ్లి ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారని ఆరోపిస్తున్నారు.
ఇక ఇటీవలి కాలంలో ఎదురైన దుబ్బాక,జీహెచ్ఎంసీ పరాభవాలు కూడా కేసీఆర్ను అంతర్మథనంలో పడేశాయన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ప్రజలకు కనిపించకపోవడం,వినిపించకపోవడం ఎప్పుడూ ఫాంహౌస్కే పరిమితమవడంపై వస్తున్న విమర్శలను కేసీఆర్ ఈసారి సీరియస్గా తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రజల్లో తిరిగేందుకు ఆయన ఆరోగ్యం సహకరించట్లేదని... అందుకే యువ నాయకుడు కేటీఆర్కు పగ్గాలు అప్పగిస్తే పార్టీకి మళ్లీ కొత్త జోష్ వస్తుందని ఆయన భావిస్తున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
నిజానికి కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేసేందుకే కేసీఆర్ 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారన్న ఊహాగానాలు అప్పట్లోనూ జోరుగా వినిపించాయి. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. మరో పదేళ్లు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటారని స్వయంగా కేటీఆరే పలు సందర్భాల్లో చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం కేటీఆర్కు పగ్గాలు అప్పగించబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఒకానొక సందర్భంలో స్వయంగా ఖండించారు. ఆయన ఆరోగ్యంపై దుష్ప్రచారం చేస్తున్నారని కూడా మండిపడ్డారు. తాజాగా మరోసారి కేటీఆర్కు ముఖ్యమంత్రి బాధ్యతలపై ఊహాగానాలు బయలుదేరడం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది.