అసద్! మీకు ఆ బిర్యానీ తినిపిస్తాం: రాజా సింగ్ కౌంటర్, బీజేపీలో చేరతానంటూ కత్తి కార్తీక
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల నేతల విమర్శలు తారస్థాయికి చేరుతున్నాయి. ఒక పార్టీపై మరోపార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తోపాటు ఎంఐఎం నేతలు కూడా సంచలన వ్యాఖ్యలతో రాజకీయ వేడిని మరింతగా పెంచుతున్నారు.
అసదుద్దీన్కూ బిర్యానీ తినిపిస్తాం..
ముఖ్యంగా బీజేపీ.. టీఆర్ఎస్, ఎంఐఎంల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర విమర్శలు చేశారు. అసదుద్దీన్ తప్పుడు ప్రచారం చేశారన్న ఆయన.. బీజేపీ ఎప్పుడూ తప్పుడు ప్రచారం చేయదని అన్నారు. అసదుద్దీన్ బీజేపీ వాళ్లకు బిర్యానీ తినిపిస్తాడంట.. తాము కూడా అసదుద్దీన్కు బిర్యానీ తినిపిస్తామన్నారు రాజా సింగ్. అంతేగాక, తమ దగ్గర వాల్మీకి సమాజ్ వాల్లు ‘పంది' బిర్యానీ బాగా చేస్తారన్నారు.
అందుకే ప్రచారానికి దూరం.. ఎంఐఎంకు ముస్లింలే ఓటేయరు
హిందూ, ముస్లింల మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నారని.. వరద సహాయం ఇవ్వకపోవడంతో ముస్లింలు మీకు ఓటు వేసే పరిస్థితి లేదని ఓవైసీనుద్దేశించి వ్యాఖ్యానించారు. ముస్లింలే ఈ విషయాన్ని చెబుతున్నారని రాజా సింగ్ తెలిపారు. అభివృద్ధి కోసం బీజేపీకి ఓటు వేయాలని ముస్లింలను విజ్ఞప్తి చేస్తున్నా.. నా అల్లుడు చనిపోవడం కారణంగానే బీజేపీ ప్రచారంలో పాల్గొనలేకపోతున్నా అని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలిపారు.
Recommended Video
బీజేపీలో చేరతానంటూ కత్తి కార్తీక.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం
ఇది ఇలావుండగా, బీజేపీలోకి చేరికలు పెరిగిపోతున్నాయి. తాజాగా, బిగ్బాస్ ఫేమ్, కార్తీక గ్రూప్ ఛైర్మన్ కత్తి కార్తీక బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితురాలై తాను త్వరలో బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొననున్నట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన నిర్మలా సీతారామన్ను ఆర్థిక మంత్రిగా చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తాను బీజేపీలో చేరతానని స్పష్టం చేశారు. ఇప్పటికే పలువురు నేతలు బీజేపీలో చేరగా, మంగళవారం విజయశాంతి బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.