కరోనా: మోడీ ఆదేశాలు బేఖాతరు..? 20 మందితో కలిసి దీపం వెలగించిన రాజాసింగ్, గో చైనా వైరస్ అంటూ
సంచలనానికి కేంద్ర బిందువు గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఏదో ఒకటి చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటారు. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాలపాటు లైట్లు ఆర్పివేసి.. దీపం వెలగించి కరోనాను తరిమివేసేందుకు మన ఐకమత్యం చాటాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారు. అయితే ఇంటిలో, బాల్కనీలో ఉండి మాత్రమే దీపం పట్టుకోవాలని సూచించారు. కానీ దానిని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉల్లంఘించారు.
రాజాసింగ్..
రాత్రి 9 గంటలకు దీపపు కాంతులు చిమ్ముతున్న కర్రను పట్టుకొని రాజాసింగ్ ఉన్నారు. అయితే ఆయన పక్కన ఇరమై మంది వరకు అనుచరులు ఉన్నారు. ఇంటి వద్దే.. కుటుంబంతో మాత్రమే గడపాలని మోడీ కోరితే.. రాజాసింగ్ మాత్రం దీపం పట్టుకొని రోడ్డెక్కారు. అదీ కూడా తన అనుచరులతో కలసి.. అంతేకాదు ‘గో బ్యాక్ చైనా వైరస్' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేరారు. రాజాసింగ్తో 20 మంది వరకు ఉండగా.. అందులో ఐదుగురు దీపంతో ఉన్న కర్రలను పట్టుకోగా..మిగతా వారు క్యాండిళ్లను చేత పట్టుకున్నారు.
గవర్నర్, సీఎం..
ఆదివారం రాత్రి రాజ్ భవన్లో తమిళి సై సౌందరరాజన్, ప్రతి భవన్లో సీఎం కేసీఆర్, తమ ఇళ్ల వద్ద మంత్రులు, అధికారులు, ప్రముఖులు, క్రీడాకారులు కొవ్వొత్తులు పట్టుకొని తమ ఐకమత్యాన్ని చాటారు. భాగ్యనగరంలో చాలామంది మాస్క్లు ధరించి దీపపు వెలుగుల మధ్య కనిపించారు. మరికొందరు తమ మొబైల్స్ ఆన్ చేశారు. ఆ 9 నిమిషాలు హైదరాబాద్ దీపపు కాంతులతో మెరిసిపోయింది.
మోడీ ఏం చెప్పారు..?
కరోనా వైరస్ను తరిమి కొడుదామని.. మనమంతా ఐకమత్యంగా ఉండేందుకు ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు లైట్లు ఆర్పివేసి సంఘీభావం తెలుపాలని శుక్రవారం ఉదయం మోడీ వీడియోలో కోరిన సంగతి తెలిసిందే. రాజా సింగ్ తీరు బీజేపీని ఇరుకున పడేసే అవకాశం ఉంది. మోడీ చెప్పిన దాన్ని బీజేపీ నేతలు ఉల్లంఘించారని విమర్శనాస్త్రాలు సంధించే అవకాశం ఉంది.