డేట్ రాసి పెట్టుకో.. ఐదు రోజుల తర్వాత స్వయంగా రంగంలోకి... సజ్జనార్కు రాజాసింగ్ మరో సవాల్...
హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సైబరాబాద్ సీపీ సజ్జనార్కు మరోసారి సవాల్ విసిరారు. ఐదు రోజుల్లోగా గోవుల అక్రమ తరలింపును అడ్డుకోకుంటే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని హెచ్చరించారు. ఇప్పటికైనా నగరంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి గోవుల అక్రమ రవాణాను అడ్డుకోవాలన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం(జనవరి 7) రాజాసింగ్ ఒక వీడియో విడుదల చేశారు.
ఐదు రోజుల్లో తర్వాత నేనే రంగంలో దిగుతా : రాజాసింగ్
'గతంలో కూడా సైబరాబాద్ పరిధిలో అక్రమంగా ఆవులను తరలిస్తున్నారని నేను కామెంట్ చేశాను. కొన్ని వాహనాలను కూడా పట్టుకున్నాను. ఇప్పుడు బహదూర్పురా కబేళాకు ప్రతీరోజూ 30,40 వాహనాలు వస్తున్నాయి. వాటిని ఎలా ఆపుతారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అక్రమంగా గోవులను తరలిస్తున్నవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోండి. లేదా ఎంఐఎం,టీఆర్ఎస్ నేతలు ఒత్తిడి చేస్తున్నారని అంటే... ఇవాళ డేట్ మీరు రాసుకోండి... ఐదు రోజుల తర్వాత నేనే రోడ్డుపై దిగుతా. ఎన్ని వాహనాలు దొరికితే అన్నింటినీ తెలంగాణ ప్రజల ముందు పెడుతా. అప్పుడు మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి.' అని రాజాసింగ్ సజ్జనార్కు సవాల్ విసిరారు. రాజకీయ నాయకులపై కామెంట్స్ చేయటం కాదని.. అక్రమంగా గోవులను తరలిస్తోన్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గతంలోనూ స్వయంగా రంగంలోకి దిగి...
గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు గతంలో కూడా రాజాసింగ్ స్వయంగా రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ 16న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ప్లాజా వద్ద గోవులను తరలిస్తున్న ఓ వాహనాన్ని రాజాసింగ్ పట్టుకున్నారు. ఖమ్మం నుంచి హైదరాబాద్లోని బహదూర్పురా కబేళాకు 15 గోవులను తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహనాన్ని చౌటుప్పల్ పోలీస్ స్టేషన్కు తరలించి, గోవులను జియాగూడ గోశాలకు తరలించారు.
తాజా సవాల్పై సీపీ ఎలా స్పందిస్తారో...?
గోవుల అక్రమ రవాణాకు సంబంధించి గతంలో ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన ఆరోపణలకు సీపీ సజ్జనార్ కూడా కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పోలీసులు డబ్బులు తీసుకుని తమ పోలీస్ స్టేషన్ పరిధి నుంచి గోవులను తరలించే వాహనాలు వెళ్లేందుకు అనుమతిస్తున్నారని రాజాసింగ్ అప్పట్లో ఆరోపణలు చేశారు. పోలీసులు బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు,వేతనాలు సరిపోకపోతే భిక్షం ఎత్తి పోలీసులకు డబ్బులిస్తామని... కానీ ఇలాంటి పాపాలు చేయవద్దని అన్నారు. ఈ విమర్శలపై స్పందించిన సీపీ సజ్జనార్... ఎవరు పడితే వారు మీడియాలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఫ్యాషన్ అయిపోయందన్నారు.పోలీసుల గురించి మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. తాజాగా రాజాసింగ్ మరో సవాల్ విసరడంతో సీపీ ఎలా స్పందిస్తారన్నది చూడాలి.