‘కేసీఆర్లోకి రజాకార్ల ఆత్మ-కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో! తెలంగాణ భారత్లోనే ఉందా?’
హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ తాజా మాజీ ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, రాజాసింగ్ వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ.. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మజ్లిస్ పార్టీ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మగా మారి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు.
లడాయి మొదలైంది: కాంగ్రెస్, కేసీఆర్ను ఏకేసిన అమిత్ షా
సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, తదితరులు పాల్గొన్నారు.
స్వాతంత్ర్య వేడుకలు జరపలేరా?
తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలంటే బీజేపీతోనే సాధ్యమని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిన రోజును టీఆర్ఎస్ ప్రభుత్వం జరపకపోవడం దారుణమన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపిస్తామని కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని నేతగా కేసీఆర్ ముందున్నారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఓటు బ్యాంక్ రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు చైతన్యం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. తెలంగాణ పోరాటాల గడ్డ అని అన్నారు.
విమోచనం అయితే విలీనమంటారా?
నిజాం పాలనకు వ్యతిరేకంగా ఎందరో ఎన్నో త్యాగాలు చేశారని బండారు దత్తాత్రేయ గుర్తు చేశారు. తెలంగాణ విమోచన దినం గురించి మాట్లాడే హక్కు కమ్యూనిస్టులకు లేదని, తెలంగాణ ఉద్యమంలో గురించి తెలియనివారు ఇది విమోచనం కాదు.. విలీనం అని అంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ తెచ్చింది టీఆర్ఎస్ కాదని.. ఆ పార్టీకి విమోచన దినోత్సవం జరిపే ధైర్యం లేదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17న విమోచన దినంగా నిర్వహిస్తామన్నారు.
కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో..
ఇది ఇలా ఉండగా, టీఆర్ఎస్ కారు అయితే.. దాని స్టీరింగ్ మాత్రం ఎంఐఎం చేతిలో ఉందని.. ఎంఐఎం ప్రోద్బలంతోనే కేసీఆర్ తనపై అక్రమ కేసులు బనాయించారని బీజేపీ తాజా మాజీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. గత నెల అనుమతి లేకుండా నగరంలో తిరంగ యాత్ర నిర్వహించినందుకు గాను రాజాసింగ్ పై కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం రాజాసింగ్ అబిడ్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. ఇద్దరు న్యాయవాదులతో కలిసి విచారణలో పాల్గొన్న ఆయన ప్రశ్నలన్నింటికి రాత పూర్వక సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం.
రజాకార్ల పాలనలో.. మనమేమైనా పాకిస్థాన్లో ఉన్నామా?
విచారణ అనంతరం రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో రజాకార్ల పాలన సాగుతోందని అన్నారు. 50ఏళ్ల క్రితం తుడిచిపెట్టుకుపోయిన రజాకార్ల ఆత్మ మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్లో ప్రవేశించిందని విమర్శించారు. ఎంఐఎం ప్రోత్సాహంతోనే కేసీఆర్ తనపై అక్రమ కేసులు బనాయించారని రాజా సింగ్ మండిపడ్డారు. స్వాతంత్ర్య దినోత్సవంనాడు తిరంగ యాత్ర నిర్వహించినందుకు తనపై కేసులు పెట్టారన్నారు. ఇవన్నీ చూస్తూ తెలంగాణ పాకిస్థాన్లో ఉందో.. భారతదేశంలో ఉంతో అర్థం కావడం లేదని అన్నారు. తనను ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా భయపడనని రాబోయే ఎన్నికల్లో కూడా తాను బీజేపీ తరపున గోషామహల్ నుంచే పోటీ చేస్తానని తెలిపారు.