ఇయాల్టి ప్రెస్ మీట్ లో అయినా నిజం చెప్పు దొరా .. ఆ కేంద్ర నిధులేం చేసినవ్ : ఎంపీ అరవింద్ సూటి ప్రశ్న
కరోనా పై దేశ వ్యాప్తంగా పోరాటం సాగుతుంది. ఇక కేంద్రం కరోనా నియంత్రణా చర్యల దిశగా తీవ్రంగా కృషి చేస్తుంది . ఇక దేశ వ్యాప్తంగా ప్రస్తుతం లాక్ డౌన్ ౩.o విధించిన కేంద్ర సర్కార్ కొన్ని సడలింపు లను కూడా ప్రకటించింది . అయితే కేంద్ర సర్కార్ ఆదేశాలకు భిన్నంగా రాష్ట్ర సర్కార్ కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ఇక ఈ క్రమంలో నేడు క్యాబినెట్ భేటీ నిర్వహించి కేంద్రం ఇచ్చిన సడలింపులు , లాక్ డౌన్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనుంది తెలంగాణా ప్రభుత్వం . ఇక ఈ నేపధ్యంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సీఎం కేసీఆర్ కు సూటి ప్రశ్నలు సంధించారు .
కరోనా ఆస్పత్రులకు , వైద్య పరికరాలకు నిధులు ఇచ్చిందన్న అరవింద్
కేంద్రం ఇప్పటికే కరోనా ఆస్పత్రుల అభివృద్ధికి నిధులు కేటాయించిందని , అలాగే కరోనా వైద్య పరికరాల కొనుగోలుకు కూడా నిధులు ఇచ్చిందని చెప్తూ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . ఇయాల్టి ప్రెస్ మీట్ లో అయినా నిజం చెప్పు దొరా .. ఆ కేంద్ర నిధులేం చేసినవ్ అంటూ సోషల్ మీడియా వేదికగా బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సూటి ప్రశ్న వేశారు. కేంద్రం ఇచ్చిన నిధులు ఇష్టారాజ్యంగా వాడుకున్నారని మండిపడ్డారు.
ఎస్డీఆర్ఎఫ్ నిధులు, రూ.599 కోట్లను ఏo చేశారని సూటి ప్రశ్న
వలస కార్మికుల భోజనం, ఇతర సౌకర్యాల కోసం కేంద్రం ఇచ్చిన ఎస్డీఆర్ఎఫ్ నిధులు, రూ.599 కోట్లను ఏo చేశారని , ఎక్కడ ఖర్చు పెట్టారని ప్రశ్నించారు ధర్మపురి అరవింద్ . ఇక ఇప్పటికే సీఎం కేసీఆర్ కేంద్ర నిధులు వాడుకుని తానే ఏదో చేసినట్టు బిల్డప్ ఇస్తున్నారని పేర్కొన్నారు . కరోనా ఆసుపత్రుల అభివృద్ధికి, వైద్యపరికరాల కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.15000 కోట్లు విడుదల చేసిందని , ఇక తెలంగాణా రాష్ట్రంలో ఎన్ని కొనుగోలు చేశారో లెక్క చెప్పాలని కోరారు. ఎన్ని పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు కొన్నారు? అని తన సోషల్ మీడియా ద్వారా అయన ప్రశ్నించారు.
జర్నలిస్ట్ ఎవరైనా ఈ ప్రశ్నలు అడిగితే, గయ్యిమని ఎగవడకు అని వ్యాఖ్యలు
15వ ఫైనాన్స్ కమిషన్ రూ.982 కోట్లు అడ్వాన్స్ ఇచ్చిందని పేర్కొన్న ధర్మపురి అరవింద్ రేషన్ కార్డు హోల్డర్స్ కి మీరిచ్చిన రూ.1500, ఈ నిధుల నుండే మళ్లించారు కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు . ఇక పేరేమో మీ సర్కార్ కు రావాలని తామే నిధులు ఇచ్చినట్టు బిల్డప్ ఇచ్చారని అర్ధం వచ్చేలా వ్యాఖ్యానించారు. సొమ్మొకరిది సోకొకరిది అన్న చందంగా తెలంగాణా సర్కార్ పని తీరు ఉందని అన్నారు. ఇక నేడు క్యాబినెట్ భేటీ నేపధ్యంలో జరుగుతున్న మీడియా సమావేశంలో జర్నలిస్ట్ ఎవరైనా ఈ ప్రశ్నలు అడిగితే, గయ్యిమని ఎగవడకు అంటూ ఎద్దేవా చేశారు ధర్మపురి అరవింద్ . ఇప్పటికే పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్ పాత్రికేయులను ఉద్దేశించి నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే .