కేసీఆర్ది మేకపోతు గాంభీర్యమే.. బీజేపీ ఎంపీల విమర్శలు
హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించింది. కేసీఆర్ పాలనలో ప్రగతి పడకేసిందని విమర్శలు గుప్పించింది. దమ్ముంటే ప్రత్యక్ష పద్ధతిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరింది.
సీఎం కేసీఆర్పై ఓ రేంజ్లో ఫైరయ్యారు బీజేపీ ఎంపీలు ధర్మపురి అర్వింద్, బండి సంజయ్, సోయం బాపూరావు. అన్ని వ్యవస్థలను మ్యానేజ్ చేస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, మోడీ అంటే కేసీఆర్ వెన్నులో వణుకు అని ఆరోపించారు. కానీ పైకి మాత్రం ధైర్యం ఉన్నట్టు నటిస్తున్నారని విమర్శించారు.
డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంపై లోక్ సభను టీఆర్ఎస్ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందని మరో ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు నిర్మించారో తెలుపాలని ప్రశ్నించారు. తాము చేసింది .. మానీ ఇతరులను విమర్శించడం సరికాదని మండిపడ్డారు. ముందు తాము చేసిన పనులను వివరించాలని సూచించారు. అలా కాకుండా ఉన్నది లేన్నట్టు, లేనిది ఉన్నట్టు ప్రచారం చేసుకోవడం మానుకోవాలని హితవు పలికారు.