బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు: ఘుమఘుమలాడనున్న తెలంగాణా వంటకాలు, షెఫ్లకు యాదమ్మ వంటలపాఠాలు!!
జులై 2 మరియు 3 తేదీలలో రెండు రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి నగరానికి విచ్చేసే ప్రధాని నరేంద్ర మోడీ మరియు దేశవ్యాప్తంగా ఉన్న భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వానికి తెలంగాణ స్పెషల్ వంటకాలను రుచి చూపించాలని బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు కసరత్తులు చేస్తున్నారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు .. అతిధులు ఆహా ఏమి రుచి అనేలా తెలంగాణా వంటకాలు
జాతీయ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అతిథులకు పెట్టె మధ్యాహ్న భోజనం ప్రత్యేకంగా ఉంటుంది అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఇప్పటికే తెలిపారు . ప్రత్యేక తెలంగాణ మెనూను కరీంనగర్కు చెందిన ప్రముఖ వంటల నిపుణురాలు యాదమ్మ పర్యవేక్షించనున్నారని, రుచికరమైన తెలంగాణ వంటకాలను సిద్ధం చేసి అతిథులను ఆహా ఏమి రుచి అనేలా చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తాజాగా బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా యాదమ్మ చేయబోయే వంటల జాబితాను సిద్ధం చేశారు.
ఫైవ్ స్టార్ హోటల్ షెఫ్ లకు యాదమ్మ వంటల పాఠాలు.. మెనూ ఇలా
ఫైవ్ స్టార్ హోటల్ ప్రధాన షెఫ్ లు, వారి సహాయకులు తెలంగాణ వంటకాలు పాఠాలను యాదమ్మ నుండి నేర్చుకున్నారు. ఆయా వంటకాలు, కావలసిన సామాగ్రి గురించి యాదమ్మ వారికి అన్ని వివరాలు వెల్లడించారు. సభ కోసం సర్వపిండి, ముద్దపప్పు, పచ్చిపులుసు, గంగవాయిలి పప్పు, భక్ష్యాలు, ఉల్లి పకోడీ, మక్క గారెలు, పంట గారెలు, పుల్ల పులుసు, బెల్లం పరమాన్నం, సేమియా పాయసం తో పాటు తెలంగాణ ప్రత్యేకమైన రుచులను అతిథులకు తెలిసేలా పలురకాల వంటలను సిద్ధం చేయడానికి నిర్ణయించారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో 3 న ప్రత్యేక భోజనం, శాఖాహార మెనూ
జాతీయ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ యొక్క రెండవ రోజు జూలై 3 న ప్రత్యేక భోజనం కోసం మొత్తం మెనూ పూర్తిగా శాకాహార భోజనం ఉంటుందని ఇప్పటికే బండి సంజయ్ చెప్పారు. రోటీలు కాకుండా అన్ని కూరలు, పప్పులు, చట్నీలు అచ్చమైన తెలంగాణ వంటకాలను తెలియజేసేలా తయారు చేస్తామని తెలిపారు. 'పుంటికూర పప్పు', 'గంగ వాయిలి కూర-మామిడికాయ పప్పు', 'పచ్చి పులుసు' వంటి వంటకాలతో పాటు 'జొన్న రొట్టెలు', 'పెద్ద బూందీ లడ్డు' వంటి వంటకాలను సిద్ధం చేస్తామని తెలిపారు. సాయంత్రం 'సకినాలు', 'గారెలు', ' సర్వపిండి' స్నాక్స్గా ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు
తెలంగాణాకు చెందిన అత్యుత్తమ ఆహారం అందించే దిశగా తెలంగాణా బీజేపీ కసరత్తు
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ఫుడ్ కమిటీ నేత హన్మకొండ మాజీ ఎంపీ చాడ సురేష్రెడ్డి ఆధ్వర్యంలో జూన్ 29న నోవాటెల్లో షెఫ్లతో కలిసి టెస్ట్ రన్ కోసం యాదమ్మ అక్కడకు వచ్చారు. అక్కడి షెఫ్ లతో వంటకాల పై చర్చించారు. తెలంగాణా స్పెషల్ రుచి అందించేలా వంటలను చెయ్యాలని అందులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వంట రుచి పెరుగుతుందో యాదమ్మ అక్కడి షెఫ్ లకు వివరించారు. తెలంగాణలో అందించే అత్యుత్తమ ఆహారాన్ని ప్రతినిధులకు అందజేయటానికి ఫుడ్ కమిటీ సన్నాహాలు చేస్తోంది.