తెలంగాణలో అధికారం మాదే, కేంద్ర పథకాలు అమలు కావడంలేదు: అమిత్ షా
నల్గొండ జిల్లాలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన కొనసాగుతోంది.హైద్రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ఆయన నేరుగా నల్గొండ జిల్లా పర్యటనకు సోమవారం నాడు బయలుదేరివెళ్ళారు.
నల్గొండ:కేంద్రప్రభుత్వ పథకాలు తెలంగాణలో సక్రమంగా అమలు కావడం లేదని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అభిప్రాయపడ్డారు.కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు కృషిచేయాలని ఆయన కోరారు.రానున్న రోజుల్లో తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
నల్గొండ జిల్లా చండూరు మండలం తేరట్ పల్లి గ్రామంలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మరుగుదొడ్లు లేకపోవడం కేంద్రప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయికి చేరకపోవడమేనని ఆయన అన్నారు. పార్టీ బలోపేతానికి కృషిచేయాలని ఆయన సూచించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలో దేశం అభివృద్ది సాధించినట్టే తెలంగాణలో కూడ జరగాలన్నారు. మోడీ అందరి కోసం, అందరి అభివృద్ది కోసం పనిచేస్తున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తోందని చెప్పారు. ఈ మేరకు మూడు రోజుల పాటు పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నట్టు ఆయన చెప్పారు.
భారతీయజనతా పార్టీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అని ఆయన చెప్పారు. గ్రామ, బూత్ ,మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ అధ్యక్షులు ఒకే వేదికపైకి రావడం అరుదైన విషయంగా పేర్కొన్నారు. బీజేపీకి 11 కోట్ల మంది సభ్యులున్నారన్నారు. 13 రాష్ట్రాల్లో బీజెపి అధికారంలో ఉందన్నారు.
తెలంగాణ పర్యటనలో భాగంగా నల్గొండ జిల్లాలో అమిత్ షా పర్యటన సోమవారం నాడు ప్రారంభమైంది. హైద్రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ఆయన నేరుగా నల్గొండ జిల్లా పర్యటనకు వెళ్ళారు.
నల్గొండ జిల్లాలోని మూడు గ్రామాల్లో అమిత్ షా పర్యటించేలా ఆ పార్టీ నాయకత్వం ప్లాన్ చేసింది.ఈ మూడు గ్రామాలకు మూడు ప్రత్యేకతలున్నాయి. దేవులపల్లి, తేరట్ పల్లి, గుండ్రాంపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించనున్నారు.
హైద్రాబాద్ నుండి మధ్యాహ్నం 1.25 నిమిషాలకు ఆయన తేరట్ పల్లి గ్రామానికి చేరుకొన్నారు. గ్రామంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపథకాల అమలుతీరును ఆయన పరిశీలిస్తున్నారు.ఈ మేరకు తేరట్ పల్లి గ్రామస్థులను ఈ విషయమై ఆరాతీశారు.
తేరట్ పల్లిలోని 16 కుటుంబాలను ఆయన పరామర్శించారు. తొలుత బీరయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఆయన యోగక్షేమాలను అడిగితెలుసుకొన్నారు. వ్యవసాయానికి సంబంధించిన సాధకబాదకాలను ఆయన తెలుసుకొన్నారు.
వ్యవసాయానికి సంబందించి ప్రధానంగా సాగునీటి సమస్యలను తేరట్ పల్లికి చెందిన గ్రామస్థులు అమిత్ షాకు వివరించారు. మరో వైపు గ్రామంలోని దళితవాడలో ఆయన సహపంక్తి భోజనం చేశారు.