నిజాం పాలనను కొనసాగిస్తున్న కెసిఆర్: రామ్మాధవ్
హైదరాబాద్: టిఆర్ఎస్ ప్రభుత్వంపై బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిజాం పాలనను కెసిఆర్ కొనసాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. అధికారం కోసమే కెసిఆర్ హమీలు గుప్పిస్తున్నారని చెప్పారు.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ నిర్వహించిన యాత్రను అడ్డుకొనేందుకు ప్రభుత్వం విఫలప్రయత్నం చేసిందని ఆయన చెప్పారు. సోమవారంనాడు రామ్ మాధవ్ హైద్రాబాద్లో మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో టిఆర్ఎస్కు ధీటైన్ ప్రత్యామ్నాయం బిజెపి మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు. 2019 ఎన్నికల్లో 350 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆయన చెప్పారు. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో బిజెపి అత్యధిక స్థానాలను కైవసం చేసుకొంటుందని రామ్ మాధవ్ ధీమాను వ్యక్తం చేశారు.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు నిర్వహించలేదో ముఖ్యమంత్రి చెప్పాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.రాష్ట్ర మంత్రులు తెలంగాణ విమోచన దినోత్సవం విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేవిధంగా మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు.
సామాజికవర్గాలను కులం పేరుతో దూషించడం సరికాదని ప్రోఫెనసర్ కంచె అయిలయ్యకు సూచించారు డాక్టర్ లక్ష్మణ్. కులం పేరుతో సమాజంలో అశాంతిని సృష్టించడం మంచిదికాదన్నారు. మోడీపై కంచె అయిలయ్య విమర్శలను లక్ష్మణ్ తప్పుబట్టారు.