తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్లాన్ అట్టర్ ఫ్లాఫ్..! ఎందుకు బూమ్రాంగ్ అయ్యిందని ఆరా..!!
హైదరాబాద్ : ఏ క్షణంలో, ఎవరు చంద్రబాబుకు బాబ్లీ నోటీసు ఎత్తుగడకు శ్రీకారం చుట్టారో గాని అది లక్ష్యాన్ని ఛేదించకపోగా రెండు ప్రభుత్వాల మెడకు గుదిబండలా పరిణమించింది. నోటీసు జారీ వెనక కేంద్రంలో అదికారంలో ఉన్న బీజెపి ప్రమేయం లేకపోయినా ప్రస్తుత మోదీ సర్కారే బాబుకు నోటీసులు జారీ చేసిందని క్షేత్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఇక ముందస్తు ఎన్నికలకు వెళ్లిన గులాబీ పార్టీకి బాబ్లీ అంశం కక్క లేని మింగలేని అంశంగా మారింది. ఉత్తర తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే ఆనాడు చంద్రబాబు మహారాష్ట్ర ప్రభుత్వంతో పోరాడరన్న విషయం వెలుగులోకి రావడం కూడా తెలంగాణ ప్రభుత్వానికి శరాఘాతంలా పరిణమించింది. దీంతో బాబుకు నోటీసుల అంశం అటు కేంద్ర బీజెపి ప్రభుత్వానికి, ఇటు తెలంగాణలో గులాబీ ప్రభుత్వానికి ప్రాణసంకటంగా మారింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడ..! ఎవరి వ్యూహ రచనలు వారివి..!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి రోజురోజుకూ పెరిగిపోతోంది. రెండు రాష్ట్రాల్లోని పార్టీలన్నీ ఇప్పటి నుంచే జోరుగా ప్రచారాలు ప్రారంభించేశాయి. ముఖ్యంగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో అక్కడి పార్టీలన్నీ అలెర్ట్ అయ్యాయి. కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన రోజే, వచ్చే ఎన్నికల కోసం తమ పార్టీ తరపున పోటీ చేయబోతే 105 మంది అభ్యర్ధుల జాబితాను ప్రకటించి సంచలనానికి తెరలేపారు. దీంతో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టాలని ఆయన వేసిన ప్లాన్కు అసమ్మతి నేతలు దెబ్బకొట్టారు. ఆయన తీసుకున్న అనూహ్య నిర్ణయంతో మిగతా పార్టీలన్నీ వ్యూహాలు రచించడం ప్రారంభించాయి.
మహాకూటమి ఏర్పడాలి..! కేసీఆర్ ను గద్దె దించాలి..!ఇదే అన్ని పార్టీల లక్ష్యం..!!
మరోపక్క టీఆర్ఎస్ను మరోసారి గద్దెనెక్కించకూడదని ఫిక్స్ అయిన ప్రతిపక్షాలు కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్, తెలుగుదేశం, తెలంగాణ జనసమితి, సీపీఐ మహా కూటమిగా ఏర్పడాలనుకుని, ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాయి. ఇప్పటికే ఈ కూటమికి సబంధించిన అనుమతులు ఆయా పార్టీల అధిష్ఠానాల నుంచి వచ్చేశాయి. ఇకపోతే సీట్ల సర్ధుబాట్లు కూడా అయిపోతే త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది.ఇదే క్రమంలో జనసమితి అదినేత కోదండరాంతో టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడో రేపో చర్చలు కూడా జరపబోతున్నారు.
మహాకూటమి చెడగొట్టేందుకు బీజేపీ ప్లాన్..! క్షేత్ర స్థాయిలో బెడిసి కొట్టిన ఉపాయం..!!
రాష్ట్రంలో మహాకూటమి ఏర్పడితే అదే జాతీయ రాజకీయాల్లోనూ కొనసాగే అవకాశం ఉన్నదని భావిస్తున్న బీజేపీ అదిరిపోయే ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి బాబ్లీ ఘటనకు సంబంధించి నోటీసులు జారీ అయ్యేలా చేసిందని టాక్ వినిపిస్తోంది. బాబ్లీ ప్రాజెక్టు వద్ద చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ నేతలు నిరసన చేసిన సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి కాంగ్రెస్ వాళ్లే చంద్రబాబుకు నోటీసులు వచ్చేలా చేశారని ప్రచారం చేసి, టీడీపీ-కాంగ్రెస్ పొత్తు పెట్టుకోకుండా చేయాలని ప్లాన్ చేసిందట.
ఆపరేషన్ బూమ్రాంగ్...! బట్ టీడిపి, కాంగ్రెస్ సేఫ్...!!
అయితే, ఈ విషయంలో ముందు నుంచీ చంద్రబాబు కానీ, కాంగ్రెస్ నేతలు కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీనే దుయ్యబడుతుండడంతో ఇది రివర్స్ అయినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ప్రస్తుతం కేంద్రంలోనూ, ఇటు మహారాష్ట్రలోనూ బీజేపీ అధికారంలో ఉంది. ఈ రెండు ప్రభుత్వాలకు తెలియకుండా నోటీసులు వచ్చే అవకాశం లేదనేది టీడీపీ నేతల వాదన. ఇప్పుడు ఈ ప్లాన్ కాస్తా రివర్స్ అవడంతో బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటు తెలంగాణలో కూడా బాబ్లీ అంశం విచిత్రంగా పరిణమించింది. ఏదో చేసి కాంగ్రెస్,టీడిపిల పొత్తు అనైతికమని రుజువు చేసే క్రమంలో అటు కేంద్ర బీజేపీ, ఇటు తెలంగాణ ప్రభుత్వం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవడమే కాకుండా మాస్టర్ ప్లాన్ బూమ్రాంగ్ ఎందుకయ్యిందనే ఆరాలో నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.