బండి సంజయ్ డ్రామాలు... దాడిపై ముస్లిం లైన్ తీసుకోమని.. బాల్క సుమన్ సంచలన ఆరోపణలు
గ్రేటర్ ఎన్నికల పోలింగ్కి మరికొద్ది గంటల సమయమే ఉన్న తరుణంలో హైదరాబాద్ నడిబొడ్డున పీపుల్స్ ప్లాజా సమీపంలో టీఆర్ఎస్-బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ తీవ్ర ఉద్రిక్తతకు తెరలేపింది. అయితే ఈ గొడవను సంజయ్పై ముస్లింల దాడిగా చిత్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు.
Recommended Video
తన ఫేస్బుక్ ఖాతాలో కొన్ని వాట్సాప్ స్క్రీన్ షాట్స్ పోస్ట్ చేసిన ఎమ్మెల్యే బాల్క సుమన్... బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. 'బండి సంజయ్ పక్కనే ఉండే వ్యక్తి,బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి ముస్లిం లైన్ తీసుకోమని తన కార్యకర్తలను ఆదేశించాడు. ఎంత దగా ఎంత మోసం... బండి సంజయ్ డ్రామాలు... గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా బీజేపీ కుట్రలకు తెరలేపింది. హైదరాబాద్ ప్రజలారా బీజేపీ దాడుల నాటకం గమనించండి. తస్మాత్ జాగ్రత్త..' అని బాల్క సుమన్ పేర్కొన్నారు.
కాగా,తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సోమవారం(నవంబర్ 30) సాయంత్రం నగరంలోని పీపుల్స్ ప్లాజాకు వెళ్లారు. అక్కడినుంచి లేక్ వ్యూ పోలీస్ అవుట్ పోస్టు సమీపంలోని ఓ హోటల్కు వెళ్లారు. ఈ సమాచారం అందుకున్న ఖైరతాబాద్ టీఆర్ఎస్ కార్పోరేటర్ విజయారెడ్డి తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. తన డివిజన్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు సంజయ్ అక్కడికి వచ్చారని... నగదు పంపిణీకి ప్రయత్నిస్తున్నారని విజయారెడ్డి ఆరోపించారు.
ఈలోగా పోలీసులు అక్కడికి చేరుకుని బండి సంజయ్ను ఆయన వ్యక్తిగత వాహనంలో అక్కడినుంచి పంపించారు. అయితే సంజయ్ వెంట వచ్చిన బీజేపీ వాహనాలను తనిఖీ చేయాలని విజయారెడ్డి పోలీసులను డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సంజయ్కు పార్టీ కేటాయించిన వాహనంపై టీఆర్ఎస్ కార్యకర్తలు చేతులతో దాడి చేశారని తెలుస్తోంది. ఈ దాడిలో వాహనం అద్దాలు పగిలిపోయాయి. ఎట్టకేలకు పోలీసులు ఇరు వర్గాలను అక్కడినుంచి పంపించి ఉద్రిక్తతను సద్దుమణిగేలా చేశారు.