ఆర్టీసీ సమ్మెకు బీజేపీ సంపూర్ణ మద్దతు ..తెలంగాణా సర్కార్ పై లక్ష్మణ్ ఫైర్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 10600 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మొత్తం 57 వేల మంది కార్మికులు ప్రజల కోసం సమ్మె కొనసాగిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆర్టీసీ నష్టాల్లో ఉండటానికి కారణం ప్రభుత్వ వైఖరని బీజేపీ మండిపడుతోంది. ఆర్టీసీ కార్మికులను విధులు నిర్వర్తించకుండా ఎస్మా ప్రయోగిస్తామని బెదిరింపులకు గురి చేయడం సరికాదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు.
అద్దె బస్సులపై దాడులు చేస్తున్న ఆర్టీసి కార్మికులు..!
ఆర్టీసీ సమ్మెకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించిన బీజేపీ నేత లక్ష్మణ్ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి సీఎం కేసీఆర్ ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని మండిపడ్డారు . ఆర్టీసీ కార్మికుల బంద్ నేపథ్యంలో మాట్లాడిన లక్ష్మణ్ తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు భాగస్వామ్యం తీసుకున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమం గురించి రవాణా మంత్రికి ఏం తెలుసని ప్రశ్నించారు. ఉద్యమంలో లేని వ్యక్తి ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ఆర్టీసీని విలీనం చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి నిర్ణయం తీసుకోవాలన్నారు.
ఎస్మా, పీడీ యాక్ట్ పేరుతో కార్మికులను బెదిరించడం సరికాదని పేర్కొన్న లక్ష్మణ్ ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు . ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కేసీఆర్ మాట తప్పారన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ విషయంలో కార్మికుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వ విధానాల వల్లే ఆర్టీసీ నష్టాల ఊబిలోకి వెళ్లిందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఇక ప్రతిపక్షాలన్నీ ఆర్టీసీ కార్మిక పక్షమే అని స్పష్టం చేస్తున్న తరుణంలో తెలంగాణా సర్కార్ ఏం నిర్ణయం తీసుకుంటుందో అన్నది వేచి చూడాలి . ఈరోజు సాయంత్రం 6 గంటల్లోపు విధుల్లో చేరాలని డెడ్ లైన్ విధించిన సర్కార్ ఆర్టీసీ కార్మికుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆందోళన ఆర్టీసీ కార్మికుల్లో నెలకొంది. అయినప్పటికీ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆర్టీసీ కార్మికులు ఉద్యమిస్తున్నారు.