తెలంగాణ అభివృద్దిలో బీజేపి భాగస్వామ్యం.!నడ్డా ఎవరో తెలియదనడం కేటీఆర్ ఆజ్ఞానమే అన్న బీజేపి ఎమ్మెల్సీ.
హైదరాబాద్ : తెలంగాణ అభివృద్ది కోసం కేంద్ర బీజేపి ప్రభుత్వం తగినంత సహకారం అందిస్తూ స్నేహపూర్వకంగా ముందుకు వెళ్తుందని, కాని గులాబీ పార్టీ నేతలే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపి ఎంఎల్సీ రాంచందర్ రావు అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాల్లో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉందని, ఆ విషయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. నిధుల పంపకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏనాడూ తారతమ్యాలు చూపించలేదని, బీజేపి పాలిత రాష్ట్రాలతో సమానంగా తెలంగాణ కూడా నిధులు విడుదల చేస్తున్నామని, అందుకు ఈ ఎస్ ఐ హాస్పటల్ల నిర్మాణంతో పాటు ఆదునికీకరణ పనులే ఉదాహరణ అని ఆయన చెప్పుకొచ్చారు.
రాబోవు రోజుల్లో తెలంగాణలో బీజేపి ప్రభావం చూపిస్తుందని, టీఆర్ఎస్ ప్రభుత్వానికి బీజేపి మాత్రమే ప్రత్యామ్నాయమని రాంచందర్ రావు స్పష్టం చేసారు. సనత్ నగర్ ఈఎస్ఐ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన రాంచందర్ రావు వన్ ఇండియాతో ప్రత్యేకంగా మాట్లడారు. ఈ సందర్బంగా ఆయన తెలంగాణ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ వైఖరిపై మండిపడ్డారు.
బీజేపి జాతీయ కార్యనిర్వాహక అద్యక్షుడు జయ ప్రకాశ్ నడ్డ ఎవరో తనకు తెలియదని, ఆయనతో తనకు పరిచయం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తనయుడు కేటీఆర్ అనడం హాస్యాస్పదంగా ఉందని రాంచందర్ రావు అన్నారు. పని అయ్యేంత వరకు ఒకరకంగా, పని ఐన తర్వాత ఒక రకంగా వ్యవహరించడం చంద్రశేఖర్ రావు కుటుంబానికి అలవాటని, కేటీఆర్ అందుకు అతీతుడు కాడని అన్నారు. నడ్డా ఎవరో తెలియదన్న కేటీఆర్ గతంలో పుష్పగుచ్చం ఇచ్చింది ఎవరికో గుర్తు పట్ట గలిగారా అని ప్రశ్రించారు. కేంద్ర మంత్రిహోదాలో పని చేసిన నడ్డా ఎవరో తెలియదని చెప్పడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్టు తెలిపారు. బీజేపిలో ఉంటేనే దేశ భక్తులు లేకపోతే దేశ భక్తులు కాదా అని కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యల పట్ల రాంచంద్రరావు స్పందించారు.
అదికారంలో ఉన్నామని అహంకారంతో మాట్లాడితే అదఃపాతాళానికి వెళ్లక తప్పదని, గతంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపి నాలుగు ఎంపి స్ధానాలను గెలుచుకున్న విషయాన్ని టీఆర్ఎస్ మర్చిపోవద్దని చురకలంటించారు. రాబోవు రోజుల్లో తెలంగాణలో బీజేపి అదికారంలోకి వస్తుందని రాంచందర్ రావు ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓ ముగిసిన అద్యాయమని అన్నారు.