బీజేపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా: రాజాసింగ్ సంచలన నిర్ణయం
హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే, రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆదివారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్కు పంపించారు. తన గో రక్షణ ఉద్యమానికి, పార్టీకి లింక్ పెడుతున్నారని, తన వల్ల పార్టీకి నష్టం జరగకూడదని రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు.
ఎమ్మెల్యే పదవితో పాటు బీజేపీకి కూడా ఆయన రాజీనామా చేశారు. ఆదివారం రాజాసింగ్ మాట్లాడుతూ.. తాను నాలుగు రోజుల క్రితం తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడికి ఇచ్చానని చెప్పారు. తాను గో రక్షణ కోసం దేనికైనా సిద్ధమని ప్రకటించారు.
తన గోరక్షణ ఉద్యమాన్ని పార్టీకి లింక్ పెట్టాలని కొందరు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఉద్యమానికి, పార్టీకి సంబంధం లేదని తేల్చి చెప్పారు. గోవధను ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్ చేశారు. అక్రమ గోరవాణాను అడ్డుకోకుంటే మేమే రంగంలోకి దిగుతామన్నారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయని చెప్పారు. తెలంగాణ వచ్చాక యథేచ్చగా గోవులను అక్రమంగా తరలిస్తున్నారని మండిపడ్డారు. మజ్లిస్ చేతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలుబొమ్మలా మారిపోయారన్నారు. గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాలను కొందరు లంచాలు తీసుకొని వదిలేస్తున్నారని చెప్పారు.