తెలంగాణపై బీజేపి ప్రత్యేక నజర్..! గవర్నర్ మార్పుతో ప్రయోగానికి శ్రీకారం..!!
హైదరాబాద్ : తెలంగాణ టార్గెట్ గా భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మక అడుగువేయబోతోందని వన్ ఇండియా మొదటి నుండీ చెప్తున్నట్టుగానే జరిగింది. వన్ ఇండియా అంచనాలు నేడు తెలంగాణ రాజకీయాల్లో వందకు వంద శాతం నిజమయ్యాయి. గత లోక్ సభ ఎన్నికల్తో అనూహ్యంగా నాలుగు స్థానాలు గెలుచుకున్న బీజేపి తన దృష్టిని తెలగు రాష్ట్రాల మీద ఫోకస్ చేయబోతోందని గతంలో వన్ ఇండియా ఎన్నో కథనాలు రాసింది. అందుకు తగ్గట్టుగానే కేంద్ర రాజకీయ కదలికలు తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో బలపడేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేయాలనుకున్న బీజేపి అటునుండి, ఇటునుండి కాకుండా వినూత్నంగా పైనుండి నరుక్కొచ్చింది. దీంతో రానున్న రోజుల్లో క్షేత్ర స్థాయిలో బీజేపి బలోపేతం కావడం ఖాయమనే చర్చ జరుగుతోంది.
తెలంగాణ పై బీజేపి ప్రత్యేక దృష్టి..! అటు,ఇటునుండి కాకుండా పైనుండి నరుక్కొచ్చిన బీజేపి..!!
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా నరసింహన్ ను మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ గా వ్యవహరించిన ఆయన్ను మోడీ సర్కారు లోనూ కొనసాగించారు. ఈ మధ్యనే ఏపీకి కొత్త గవర్నర్ ను నియమించిన మోడీ ప్రభుత్వం, తాజాగా తెలంగాణ గవర్నర్ గా వ్యవహరిస్తున్న నరసింహన్ ను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా తమిళనాడుకు చెందిన తమిళ సై సౌందర్ రాజన్ నియమితులయ్యారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న తమిళి సైను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా నియమించటం కీలక ఎత్తుగడగా చెప్పక తప్పదనే వాదనలు రాజకీయ విశ్లేషకుల నుండి వినిపిస్తున్నాయి.
వెంకన్న భక్తుల్లో అసంతృప్తి..! సీఎం నిర్ణయం మార్చుకోవాలని విజ్ఞప్తి..!!
గవర్నర్ మార్పుతో బీజేపి కీలక అడుగు..! ప్రభావం చూపనున్న మహిళా గవర్నర్..!!
ఇదిలా ఉంటే, ఊహించని రీతిలో తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకోవటం ఆసక్తికరంగా మారింది. మోడీ సర్కారులో కేంద్రమంత్రిగా వ్యవహరించిన దత్తాత్రేయను తర్వాతి కాలంలో కేంద్రమంత్రి పదవి నుంచి తొలగించటం తెలిసిందే. ఇది ఆయనకు అప్పట్లో కొంత ఇబ్బందిగా మారినప్పటికీ, రాజకీయాల్లో మాత్రం క్రియాశీలంగా వ్యవహరించారు. పార్టీపై తనకున్న నమ్మకానికి తగినట్లుగా దత్తన్నకు గవర్నర్ గిరి దక్కటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు నియామకాలతో పాటు, మరో మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అమీత్ షా వ్యూహం..! తెలంగాణలో బలపడాలనేదే లక్ష్యం..!!
తాజాగా చేపట్టిన గవర్నర్ల ఎంపిక మొత్తం వ్యూహాత్మకంగా సాగిందనేది దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు రెండు సార్లు ముఖ్యమంత్రి అయినా ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. దీనిని రాజకీయంగా బీజేపీ వాడుకోవాలని ప్రయత్నం చేసింది. బీజేపీ విశ్వాస పాత్రుడుగా ముద్ర వేసుకున్న నరసింహన్ ను కూడా చంద్రశేఖర్ రావు మచ్చిక చేసుకున్నారు. అందుకే మహిళను నియమించడం ద్వారా చంద్రశేఖర్ రావు చనువుకు చెక్ పెట్టారు. అంతేకాదు మంత్రివర్గంలో మహిళలకు చోటు కల్పించటానికి చంద్రశేఖర్ రావు కు ఇష్టం ఉండదని ప్రచారం. అందుకే మహిళా నేతలకు మంత్రి పదవులు ఇవ్వలేదన్న వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి మహిళా గవర్నర్ ను నియమించటం ద్వారా, వచ్చే ఎన్నికలే టార్గెట్ గా మోడీ, అమీత్ షాలు వేసిన మరో వినూత్న అడుగుగా చర్చ జరుగుతోంది.
కేసీఆర్ కు చిక్కులు తప్పవా..! కొత్త గవర్నర్ తో సఖ్యతపై నెలకొన్న సందేహాలు..!!
ఈ నిర్ణయం తన రాజకీయ ప్రత్యర్థి చంద్రశేఖర్ రావు కి అసహనం కలిగిస్తుందనడంలో వింతేమీ లేదు. ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిలోనూ గవర్నర్ పాత్ర కీలకంగా ఉంటుంది. అందుకే చంద్రశేఖర్ రావు తరచుగా నరసింహన్ ను కలిసేవారు. ఇక నుంచి, మహిళా గవర్నర్ వద్దకు వెళ్లాల్సిన పరిస్ధితులు తలెత్తడం, చంద్రశేఖర్ రావు కు మానసిక వేదనేకలిగిస్తుందనేది బీజేపి నేతల వాదన. పాలనాపరంగా చేపట్టాల్సిన కార్యక్రమాల్లో గవర్నర్ హోదాలో ఇవ్వాల్సిన ప్రాధాన్యతలు ఎక్కువే ఉంటాయి. అలాంటపుడు తనకు ఏ మాత్రం ఇష్టం లేని రీతిలో ఎంపిక చేసిన గవర్నర్ చంద్రశేఖర్ రావు కు పెద్ద ఇబ్బందిగా మారే అవకాశాలు ఉన్నట్టు, ఇదే అంశాన్ని అస్త్రంగా వాడుకుని రాష్ఠ్రంలో బీజేపి జెండా పాతలని ప్రణాళిక రచిస్తోంది.