గులాబీవనం కాదది, గాలి బుడగ.. పునాదిలేని భవంతి మీద తండ్రీకొడుకులు.. దత్తన్న సురుకులు..!
హైదరాబాద్ : బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ అలియాస్ దత్తన్నకు కోపమొచ్చింది. స్వతహాగా నెమ్మదస్తుడైన దత్తన్న టీఆర్ఎస్ నేతలపై చిందులేశారు. పునాదిలేని భవంతి మీద నిలబడి ఇంకెన్ని డ్రామాలు ఆడుతారంటూ ఫైరయ్యారు. మీకే సక్కగా లేదు.. బీజేపీకి మీరు చెప్పేదేంటంటూ విరుచుకుపడ్డారు. బీజేపీ గురించి చులకనగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమంటూ అల్టిమేటం కూడా ఇచ్చేశారు.
వన్ ఇండియా ఎఫెక్ట్ : సీఎం దగ్గరకు వెళ్లొద్దు.. సాయం చేస్తామంటూ రైతు పాదయాత్రను ఆపిన అధికారులు
టీఆర్ఎస్పై నిప్పుల వాన.. దత్తన్న గరమయ్యిండ్రు..!
మాజీ కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ గరమయ్యారు. టీఆర్ఎస్ పార్టీ విధానాలపై మండిపడ్డారు. అసలు ఆ పార్టీ గులాబీవనం కాదని.. గాలి బుడగ లాంటిదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పునాదిలేని భవంతి మీద నిలబడ్డ తండ్రీ కొడుకుల పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. ఆగస్టు తర్వాత అసలైన పరిపాలన ఉంటుందన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన ఇలా విరుచుకుపడ్డారు. ఇప్పటివరకు చేసింది నకిలీ పరిపాలనా అనుకోవాలా అంటూ చురకలంటించారు.
ఇప్పుడిప్పుడే ముఖ్యమంత్రి అయినట్లుగా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడటం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. మున్సిపల్ చట్ట సవరణ రాజ్యాంగ స్పూర్తికి తూట్లు పొడిచేలా ఉందన్నారు. బిల్లులోని అంశాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ఫైరయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించడం ఖాయమని తద్వారా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పుకొచ్చారు.
మున్సిపల్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం.. ప్రజల్లోకి వెళతాం..!
లోపభూయిష్టమైన మున్సిపల్ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు దత్తన్న. బీజేపీ ఎగిరే పార్టీ కాదు నిలదొక్కుకునే పార్టీ అని చెప్పుకొచ్చారు. బీజేపీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని.. పల్లెల్లో సైతం యువత స్వచ్చందంగా పార్టీలో చేరుతున్నారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు సన్నద్దమవుతున్నామని చెప్పిన దత్తన్న.. 17 ఎంపీ స్థానాలను క్లస్టర్లుగా ఏర్పాటు చేసి రంగంలోకి దిగుతామన్నారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కూడా దత్తన్న మండిపడ్డారు. ఆయన అహంకార పూరిత ధోరణిలో మాట్లాడటం సరికాదన్నారు. బీజేపీ గురించి చాలా చులకనగా మాట్లాడిన రోజులు మరచిపోయారా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడేమో బీజేపీ అంటే భయపడుతున్నట్లుగా వ్యవహరిస్తున్నారని చురకలు అంటించారు.పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన మార్పును టీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని ఫైరయ్యారు. బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.
కొత్త చట్టంతో కేసీఆర్ ఆడుకోవాలని చూస్తుండ్రు..!
లంచం అడిగితే చెప్పుతో కొట్టమని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ మాటకు కట్టుబడి ఉన్నారా అంటూ ప్రశ్నించారు. మున్సిపల్ శాఖతో పాటు ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో అవినీతి పెరిగిపోయిందని ధ్వజమెత్తారు. గొర్రెల పంపిణీ కోసం 4 వేల కోట్ల రూపాయలు ఇస్తే అందులోనూ అవినీతి చోటుచేసుకుందని మండిపడ్డారు. కొన్ని శాఖల్లో జరుగుతున్న అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించే ధైర్యం కేసీఆర్కు ఉందా అని సవాల్ విసిరారు.
నూతన మున్సిపల్ చట్టంతో అధికారం తన గుప్పెట్లో పెట్టుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఫైరయ్యారు. ప్రతిపక్ష సభ్యులపై కక్ష సాధించేలాగా ఆ చట్టాన్ని వాడుకునే ప్రమాదం ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం వార్డుల విభజన, రిజర్వేషన్లలో చట్టాలను కాలరాస్తూ ప్రభుత్వానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారని మండిపడ్డారు. హైకోర్టు మందలించినా కూడా కేసీఆర్కు పట్టడం లేదని ఆరోపించారు. మున్సిపల్ పోరులో టీఆర్ఎస్ పార్టీని దీటుగా ఎదుర్కొంటామని.. ఆ మేరకు 30వ తేదీన అన్ని మున్సిపాలిటీల్లో అవినీతిపై నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జెండా రెపరెపలాడుతుందని.. కాషాయ దండుకు మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.