ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బీజేపీ నేత బద్దం బాల్రెడ్డి కన్నుమూత
హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యుడు బద్దం బాల్రెడ్డి శనివారం కన్నుమూశారు. ఆయన ఆరోగ్యం బాగా లేకపోవడంతో బంజారాహిల్స్లోని కేర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు సాయంత్రం ఆరున్నర గంటలకు తుది శ్వాస విడిచారు.
బద్దం బాల్రెడ్డి మృతి పట్ల తెలంగాణ సీఎంకేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మణ్, కిషన్రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులు బాల్రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
హెల్త్ బులిటిన్ విడుదల చేసిన కాసేపటికి మృతి
అంతకుముందు వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆరోగ్యం విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు శనివారం సాయంత్రం వెల్లడించిన హెల్త్ బులిటెన్ తెలిపాయి. అదే సమయంలో బద్దం బాల్రెడ్డిని ఆస్పత్రిలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పరామర్శించారు. ఈ నెల 10 తేదీన బద్దం బాల్రెడ్డి కేర్ ఆస్పత్రిలో చేరారని, ఆయనకు కాలేయ సమస్య ఉందని వైద్యులు చెప్పారని అన్నారు. ఆయన పరిస్థితి ఇంకా విషమించిందని, ఇప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి సీరియస్గా ఉందని వైద్యులు చెబుతున్నారని అన్నారు. ఆ తర్వాత సాయంత్రం ఆయన కన్నుమూశారు.
కార్వాన్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు బద్దం బాల్రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పాతబస్తీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన బద్దం బాల్రెడ్డిని అభిమానులు గోల్కొండ టైగర్గా పిలుచుకొనేవారు. పాతబస్తీ అలియాబాద్ జంగమ్మెట్ ప్రాంతానికి చెందిన ఆయన ఓల్డ్సిటీలో బీజేపీ బలోపేతానికి విశేషమైన కృషి చేశారు.
అప్పట్లో ఎంఐఎం వ్యవస్థాపకుడు సలావుద్దీన్ ఓవైసీకి పాతబస్తీలో ఆయన గట్టిపోటీ ఇచ్చారు. హైదరాబాద్తో పటు తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అభివృద్ధి చేసేందుకు కృషి చేసిన నాయకులలో బద్దం బాల్రెడ్డి ప్రముఖుడు. ఆయన పేరును పలుమార్లు గవర్నర్ పదవికి బీజేపీ అధిష్టానం పరిశీలించింది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ నుంచి బీజేపీ తరఫున ఆయన పోటీ చేసి ఓడిపోయారు.