బిజెపికి షాక్: ఉగాది తర్వాత కీలక ప్రకటన, పార్టీ వీడే యోచనలో నాగం
హైదరాబాద్: మాజీ మంత్రి బిజెపి సీనియర్ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి పార్టీ మారే యోచనలో ఉన్నారు. ఉగాది తర్వాత ఆన భవిష్యత్ కార్యాచారణను ప్రకటించనున్నట్టు నాగం జనార్ధన్ రెడ్డి ప్రకటించారు. కొంత కాలంగా నాగం జనార్దన్ రెడ్డి బిజెపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేుతారనే ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో నాగం చేసిన ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.
2011 ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టిడిపికి రాజీనామా చేసిన నాగం జనార్ధన్ రెడ్డి తెలంగాణ నగారా సమితిని ఏర్పాటు చేశారు. అయితే తెలంగాణ నగారా సమితిని ఎక్కువ కాలం నడపలేకపోయారు. 2012 లో జరిగిన నాగర్ కర్పూల్ ఉప ఎన్నికల్లో నాగం జనార్ధన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత నాగం జనార్ధన్ రెడ్డి బిజెపిలో చేరారు.
బిజెపిలోనే ఉంటా, నాగర్కర్నూల్ నుండి పోటీ చేస్తా: నాగం
2014 ఎన్నికల్లో మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసిన నాగం జనార్ధన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. తన కొడుకు నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయితే బిజెపి రాష్ట్ర నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుపై నాగం జనార్ధన్ రెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది.
ఉగాది తర్వాత పార్టీ మార్పుపై నిర్ణయం
బిజెపిని వీడే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకొంటానని మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి ప్రకటించారు.ఉగాది అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు. కార్యకర్తల అభిప్రాయం ప్రకారం నడుకుంటానని నాగం పేర్కొన్నారు.
కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారు.
బిజెపి రాష్ట్ర నాయకత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల తమ కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారని నాగం జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. కార్యకర్తలతో తాను సమావేశం కానున్నట్టు నాగం జనార్ధన్ రెడ్డి ప్రకటించారు. అయితే కార్యకర్తల అభీష్టం ఏ రకంగా ఉంటుందనే విషయాన్ని తాను ఇప్పుడే చెప్పలేనని నాగం జనార్ధన్ రెడ్డి ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీలోకి నాగం
మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. అయితే నాగం జనార్ధన్ రెడ్డి మాత్రం ఈ వార్తలను ఇప్పటివరకు ఖండిస్తు వస్తున్నారు. అయితే ఇటీవలనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొందరు నాగం జనార్ధన్ రెడ్డితో చర్చలు జరిపారనే ప్రచారం సాగుతోంది. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సానుకూలంగా ఉన్నారని సమాచారం. అయితే నాగం మాత్రం పైకి మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. కానీ, గురువారం నాడు ఉగాది తర్వాత కీలక ప్రకటన చేయనున్నట్టు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.
నాగర్ కర్నూల్ లో నాగందే హవా
నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో 30 ఏళ్ళుగా నాగం జనార్ధన్ రెడ్డి హవా కొనసాగింది. 2014 ఎన్నికల సమయంలో నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి తనయుడిని బిజెపి అభ్యర్థిగా నాగం బరిలోకి దింపారు. అయితే ఈ ఎన్నికల్లో నాగం తనయుడు ఓటమి పాలయ్యాడు. నాగం మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి కూడ ఓటమి పాలయ్యారు.టిడిపిలో ఉన్నంత కాలం ఈ నియోజకవర్గం నుండి వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు. 2012లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. కానీ, కాంగ్రెస్ పార్టీలో నాగం జనార్ధన్ రెడ్డి చేరుతారా, ఇంకా మరేదైనా నిర్ణయం తీసుకొంటారా అనేది మాత్రం ఉగాది తర్వాత తేలనుంది.