తెలంగాణపై కమలం ప్రత్యేక ఫోకస్..! అందుకే అటునుంచి నరుక్కొస్తున్న బీజేపి..!!
హైదరాబాద్ : త్వరలోనే తెలంగాణకు కొత్త గవర్నర్ ను నియమించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి సంకేతాలు కూడా అలాగే అందుతున్నాయి. దీని వెనక అనేక కారణాలే ఉన్నాట్టు చర్చ జరుగుతోంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడిప్పుడే బల పడుతోంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలను దక్కించుకోవడంతో, వచ్చే ఎన్నికల వరకు తెలంగాణలో బీజేపీ మరింత బలపడాలని చూస్తుంది.
ఇందుకోసం ఇప్పటి నుండే కసరత్తు మొదలెట్టినట్లు తెలుస్తోంది. బీజేపీకి చెందిన వారినే తెలంగాణలో గవర్నర్ గా నియమిస్తే అనుకూల వాతావరణం ఉంటుందనే వ్యూహంతో కమలం పార్టీ ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి కొత్త గవర్నరుగా సీనియర్ బీజేపీ నేతలు వస్తారని, అప్పుడు తెలంగాణ పాలిటిక్స్ మరింత రసవత్తరంగా మారబోతున్నాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
తెలంగాణపై కమలం నజర్..! బలోపేతం అవ్వడమే లక్ష్యం అంటున్న బీజేపి నేతలు..!!
బీజేపి వ్యూహంలో భాగంగా చంద్రశేఖర్ రావు సర్కారుకు-రాజ్ భవన్ వర్గాలకు మధ్య దూరం పెరుగుతోందన్న మాట వినిపిస్తుంది. మొదటి నుండి ఉన్న సఖ్యత నేడు తగ్గుతోందనిపిస్తుంది. ఇక బీజేపీ రెండో విడత అధికారంలోకి వచ్చిన తర్వాత, గవర్నర్ శైలిలో మార్పు వచ్చిందన్న భావన టీఆర్ఎస్లో పెరుగుతోందని, మున్సిపల్ బిల్లును తిప్పిపంపడమే అందుకు తొలి నిదర్శనమని గులాబీ నేతలు చర్చించుకుంటున్నట్లు సమాచారం. మరీ వీరి మాటలు కరెక్టేనా ఇంతకాలం సీఎం చంద్రశేఖర్ రావు కు అన్ని విషయాల్లో సహకరించిన గవర్నర్, తన పంథా మార్చుకుంటున్నారా? ఇప్పుడంతా ఇలాంటి ప్రశ్నల చుట్టే తెలంగాణ రాజకీయాలు చక్కర్లు కొడుతున్నాయి.
వ్యవస్థలపై పూర్తి అజమాయిషీ..! తెలంగాణకు కొత్త గవర్నర్ ను నియమించనున్న కేంద్రం..!!
2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాగానే మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ గవర్నర్లను మార్చినా నరసింహన్ ను కొనసాగించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు ఉండటంతో నరసింహన్ ను మార్చలేదు. సమైక్య రాష్ట్రంలో గవర్నర్గా వచ్చిన ఈ.ఎస్.ఎల్. నర్శింహన్, తొమ్మిది సంవత్సరాలుగా రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు ఉమ్మడి గవర్నర్గా కొనసాగుతున్నారు. దీంతో రెండు రాష్ట్రాల రాజకీయాలపై పూర్తి అవగాహనకు వచ్చారాయన. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సీఎం చంద్రశేఖర్ రావు తో అత్యంత సన్నిహింతంగా ఉన్నారు. ప్రతి విషయంలో రాష్ట్ర సర్కారుకు సలహాలు, సూచనలు చేస్తూ, బాసటగా ఉండేవారు. కీలక విషయాల్లో సీఎం చంద్రశేఖర్ రావు కూడా గవర్నర్ను సంప్రదించేవారు. దీంతో ఇరువురి మధ్య మంచి సంబంధాలు కొనసాగాయి.
తొలిసారి విభేదించిన గవర్నర్..! కేసీఆర్ చట్టాన్ని వెనక్కి పంపిన నరసింహన్..!!
అయితే తాజా పరిణామాలు, రాజ్భవన్కు, టీఆర్ఎస్కు దూరం పెరిగిందా అన్న చర్చను లేవనెత్తుతున్నాయి తొలిదఫా మోడీ సర్కారుతో సన్నిహింతగా ఉన్నా, చంద్రశేఖర్ రావు సర్కారు విషయంలో కేంద్రం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు, రాజకీయవర్గాల్లో వాడివేడి చర్చకు దారి తీస్తున్నాయి. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ, నాలుగు స్థానాలు గెలవడంతో, ఇక్కడ బలపడే అవకాశాలపై కసరత్తు చేస్తోంది కమలం. సభ్యత్వ నమోదు కోసం ఏకంగా కేంద్ర హోంమంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షా తెలంగాణకు రావడంతో, రాజకీయ పరిణామాలు మరింత వేడెక్కడం మొదలైంది. ఇక్కడి టీఆర్ఎస్ సర్కారుతో ఢీ అంటే ఢీ అంటోంది బీజేపీ. రాష్ట్రంలో బలపడేందుకు గవర్నర్ కార్యాలయాన్ని వాడుకోవడం బీజేపీ ప్రారంభించిందన్నది తెలంగాణ భవన్ ఆరోపణ. ఇందుకు తాజా ఉదంతమే నిదర్శనమంటోంది గులాబీ దళం. దీంతో ప్రస్తుతం ఇంతకాలం రాష్ట్రానికి, కేంద్రానికి అనుసంధానకర్తగా, సఖ్యతగా ఉన్న గవర్నర్ తన ప్రణాళిక మార్చుకున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
అంత కేంద్ర వ్యహంలో భాగమే..! టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం మేమే అంటున్న బీజేపి..!!
మున్సిపల్ ఎన్నికల కోసం తెలంగాణ సర్కారు హడావుడిగా తెచ్చిన మున్సిపల్ చట్టంలోని లోపాలను, బీజేపీ రాష్ట్ర నేతలు గవర్నర్ను కలిసి, ఫిర్యాదు చేయటం, వెంటనే తన వద్దకు వచ్చిన బిల్లును ఆమోదించకుండా సవరణలకు సూచించడం అంతటా చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ నర్శింహన్, తాజా రాజకీయ పరిస్థితుల్లో కేంద్రం కనుసన్నల్లో వ్యవహరిస్తున్నారని మాట్లాడుకుంటున్నారు గులాబీ నేతలు. సుదీర్ఘకాలం కొనసాగిన గవర్నర్, త్వరలో మారుతారని, వెళ్లే ముందు చంద్రశేఖర్ రావు ప్రభుత్వం తెచ్చిన మున్సిపల్ చట్టంపై అభ్యంతారాలు పెట్టి ఆర్డినెన్స్ తెచ్చేలా చేసారంటున్నారు. ఇది ప్రారంభం మాత్రమేనని, మున్ముందు మరింత కఠినంగా వ్యవహరించే రాజ్భవన్ను చూస్తారన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.