తెలుగు రాష్ట్రాల్లో ఆపరేషన్, బీజేపీలోకి కాంగ్రెస్ నేత: రేవంత్ వెళ్తారా?
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. ఉత్తరాదితో పాటు కర్నాటక తదితర రాష్ట్రాల్లో పలువురు నేతలు కమలం పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారు.
హైదరాబాద్: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. ఉత్తరాదితో పాటు కర్నాటక తదితర రాష్ట్రాల్లో పలువురు నేతలు కమలం పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారు. ఇప్పుడు తెలంగాణలోను కాంగ్రెస్ నేతలు ఆ జాబితాలో చేరుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నందీశ్వర్ గౌడ్, ఆయన తనయుడు అభిషేక్ గౌడ్లు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ అధ్యక్షులు లక్ష్మణ్ల సమక్షంలో బీజేపీలో చేరారు. రానున్న ఆరేడు నెలల్లో మరికొంతమంది కీలక నేతలు కమలం పార్టీ వైపు వస్తారని చెబుతున్నారు.
ఫ్యామిలీ మినహా.. తెరాసలోని చాలామంది నేతలు కేసీఆర్కు షాకిస్తారా?
మరో పదిమంది నేతలు క్యూలో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. నిన్నటి వరకు తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయం బీజేపీయా, కాంగ్రెస్ పార్టీయా అనే చర్చ సాగింది. ఇటీవల మాత్రం కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయంగా కనిపించింది. కానీ బీజేపీ తిరిగి పుంజుకుంటోంది.
అమిత్ షా దిశానిర్దేశనం
ఆపరేషన్ ఆకర్ష్ పైన జాతీయ అధ్యక్షులు అమిత్ షా దిశానిర్దేశనం మేరకు అధికార తెరాస, ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలతో బీజేపీ నేతలు మంతనాలు ప్రారంభించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ బాధ్యతను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావుకు అప్పగించారని సమాచారం.
రేవంత్ రెడ్డి వస్తారా?
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదని అంటున్నారు. 15 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఇప్పుడు మిగిలింది ఇద్దరు మాత్రమే. పన్నెండు మంది అధికార తెరాసలోకి వెళ్లగా, ఆర్ కృష్ణయ్య తన తోవలో తాను వెళ్తున్నారు.
ఏపీలో టిడిపి అధికారంలో ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తెలంగాణపై దృష్టి సారించే పరిస్థితుల్లేవు. తెలంగాణ టిడిపి బాధ్యతలు మొత్తం టి నేతల పైనే పడ్డాయి. రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కీలక నేతగా కనిపిస్తున్నారు.
తెలుగుదేశం పరిస్థితి నేపథ్యంలో..
అయితే తెలంగాణలో టిడిపి పరిస్థితి ఆశాజనకంగా లేకుంటే ఆయన కూడా బీజేపీ వైపు వెళ్లే అవకాశాలు కొట్టివేయలేమనే వాదన ఎప్పటి నుంచో ఉంది. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించినందున ఆయనపై మరోసారి చర్చ జరుగుతోంది. ఆయన మాత్రం పార్టీ మారనని ఇదివరకు చెప్పారు.
ప్రత్యామ్నాయం మేమే
కాగా, నందీశ్వర్ గౌడ్ బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా సమక్షంలో సోమవారం ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రంలో మూడు రోజులపాటు పర్యటిస్తారన్నారు.
అందుకే బీజేపీలో చేరా.. నందీశ్వర్
బీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పించాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే రాజ్యసభలో కాంగ్రెస్ అడ్డుపడటం బాధించిందని నందీశ్వర్ గౌడ్ అంటున్నారు. అమిత్ షా, ప్రధాని మోడీల నిర్ణయాలకు ఆకర్షితుడినై బీజేపీలో చేరానన్నారు. కాంగ్రెస్ పార్టీ తీరు వల్లే తాను అందులో ఉండలేకపోయానని చెప్పారు.