పది రోజుల్లో బిజెపి కొత్త చీఫ్: రేసులో లక్ష్మణ్, మురళీధర రావు
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడి ఎన్నిక మరో పది రోజుల్లో పూర్తి కానుంది. కొత్త అధ్యక్షుడి రేసులో జాతీయ కార్యదర్శి మురళీధర రావు, బిజెపి శాసన సభా పక్ష నేత డాక్టర్ కె లక్ష్మణ్, సీనియర్ నేత పేరాల చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.
బిజెపి తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఇప్పటికే రెండుసార్లు రాష్ట్ర అధ్యక్షుడిగా టర్మ్లు పూర్తి చేసుకున్నారు. ఈసారి కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నారు. బిజెపి కార్యదర్శి కృష్ణదాస్ ఆదివారం నాడు నేతలతో అధ్యక్షుడి విషయమై విడివిడిగా చర్చించారు. సోమవారం కూడా చర్చించనున్నారు.
రేసులో మురళీధర రావు, డాక్టర్ కె లక్ష్మణ్, పేరాలలతో పాటు మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ రామచంద్ర రావు, అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు తదితరుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
కొత్త అధ్యక్షుడిపై బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, ప్రస్తుత తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డిలు కూడా చర్చించనున్నారు. తెలంగాణ రాష్ట్ర బిజెపి కొత్త అధ్యక్షుడిని పది రోజుల్లో కొత్త నియమించేందుకు జాతీయ నాయకత్వం కసరత్తు చేస్తోంది.