ఆ కుట్రలను అడ్డుకోవాలి, ఓడిపోతే ఆ తప్పంతా మనదే: లక్ష్మణ్
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కూటములు ఏర్పాటు చేస్తున్నారని, ఈ కుట్రలను పార్టీ శ్రేణులు అడ్డుకోవాలని బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ పిలుపునిచ్చారు.
సోమవారం నాడు హైద్రాబాద్లో జరిగిన బూత్ స్థాయి బిజెపి నేతల సమావేశంలో ఆయన ప్రసంగించారు. పార్టీలు, సిద్దాంతాలు లేకుండా బిజెపిపై, ప్రధానమంత్రిపై ఏర్పాటౌతున్న కూటములు ఏర్పాటు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇలాంటి కుట్రలను పార్టీ శ్రేణులు అడ్డుకోవాలని డాక్టర్ లక్ష్మణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
రానున్న ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరూ కూడ సైనికులా మాదిరిగా పనిచేయాలని లక్ష్మణ్ కోరారు. ప్రతి పార్టీ కార్యకర్త పార్టీ అభివృద్ది కోసం శ్రమించాల్సిందిగా కోరారు. జాతీయ రాజకీయాల్లో తెలంగాణ సీఎం కీలకపాత్ర పోషిస్తాడని ప్రకటించారు. కానీ, తెలంగాణ ప్రజలు కెసిఆర్ కు వ్యతిరేకంగా ఉన్నారని డాక్టర్ లక్ష్మన్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో నమ్మే పరిస్థితి ఉండదన్నారు.
కర్ణాటక రాష్ట్ర ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంపై బిజెపి నాయకత్వం కేంద్రీకరించే అవకాశం ఉందని లక్ష్మణ్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపిని గెలిపించడంలో ప్రతి కార్యకర్త అహర్నిశలు కృషి చేయాలని ఆయన కోరారు.
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బిజెపి విజయం సాధించకపోతే ఆ తప్పంతా మనదే అవుతోందని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. కాగ్ నివేదిక తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టని లక్ష్మణ్ చెప్పారు. ఈ నివేదిక వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ముఖ్య నేతలు, మంత్రులు కూడ మాట్లాడలేని స్థితిలో ఉన్నారని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు.
హైద్రాబాద్ నగర ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇదే నినాదంతో గ్రేటర్ హైద్రాబాద్ నగరానికి చెందిన కార్యకర్తలు ప్రజల్లో ప్రచారం నిర్వహించాలని ఆయన సూచించారు.