గులాబీ Vs కమలం.. ఇంటర్ ఫలితాలపై పోరుబాట.. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడి నిరవధిక దీక్ష
హైదాబాద్ : రాష్ట్రంలో రెండు పువ్వుల మధ్య పంచాయితీ పీక్ స్టేజీకి చేరింది. గులాబీ వర్సెస్ కమలం తీరుగా లొల్లి జోరందుకుంటోంది. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే దిశగా ఆచితూచి అడుగులేస్తున్నారు కమలనాథులు. ఇంటర్మీడియట్ ఫలితాల తప్పిదాల్ని ఎండగడుతూ ప్రజాక్షేత్రంలో పోరుకు సిద్ధమవుతున్నారు. నివేదికల పేరుతో సైడ్ అయిపోదామని భావిస్తున్న ప్రభుత్వ కుట్రల్ని తిప్పికొడతామంటున్నారు. ఆ క్రమంలో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు లక్ష్మణ్ నిరవధిక నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు.
టీఆర్ఎస్లో ముసలం.. రోడ్డెక్కిన టికెట్ల పంచాయితీ.. సూసైడ్ అటెంప్ట్
టీఆర్ఎస్ హవాకు బ్రేక్..!
రాష్ట్రంలో టీఆర్ఎస్ హవాకు బ్రేక్ వేయాలని చూస్తున్న బీజేపీ నేతలకు సరైన అస్త్రం దొరికింది. ఇంటర్ ఫలితాల్లో తప్పులు దొర్లిన కారణంగా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతారా అంటూ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు. అందుకే అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇంటర్మీడియట్ ఫలితాల నిర్లక్ష్యానికి నిరసనగా.. సోమవారం (29.4.2019) నుంచి బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు లక్ష్మణ్ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించనున్నారు.
ప్రభుత్వంపై మురళీధర్ రావు గుస్సా
ఇంటర్మీడియట్ ఫలితాలు అస్తవ్యస్తంగా మారడం.. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంపై ఇంతవరకు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు. ఇంటర్ దోషులను ప్రభుత్వం ఎందుకు కాపాడుతోందని నిలదీశారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు వైఫల్యాలపై సోమవారం నుంచి బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు లక్ష్మణ్ పార్టీ స్టేట్ ఆఫీస్ లో నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభిస్తారని తెలిపారు. ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ఆయన దీక్ష కొనసాగుతుందని చెప్పారు.
దత్తన్న ఆరోపణల పర్వం
కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ లీడర్ బండారు దత్తాత్రేయ టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుపై విరుచుకుపడ్డారు. లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యంతో ముడిపడి ఉన్న ఇంటర్మీడియట్ ఫలితాల నిర్లక్ష్యంపై తప్పించుకోవాలని చూడటం సరికాదన్నారు. నివేదిక పేరుతో చేతులు దులుపుకోవాలని భావిస్తోందని ఆరోపణలు గుప్పించారు. గ్లోబరీనా సంస్థకు టెండర్ కట్టబెట్టడం వెనుక రాజకీయ అదృశ్య శక్తి ఉందని మండిపడ్డారు. దీని వెనుక మంత్రి జగదీశ్ రెడ్డి పాత్రధారి మాత్రమేనని.. సూత్రధారి ఎవరో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
లక్ష్మణ్ దీక్షతో ప్రభుత్వం కదిలేనా?
ఇంటర్మీడియట్ ఫలితాల తప్పిదాలపై రాష్ట్ర బీజేపీ నేతలు మండిపడుతున్నారు. పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు. ఆ క్రమంలో ఇటీవల గవర్నర్ నరసింహన్ ను కలిసి విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ పనితీరు సరిగా లేదంటూ ఫిర్యాదు చేశారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ విద్యార్థి కుటుంబాలకు 25 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మొత్తానికి లక్ష్మణ్ దీక్షతో ప్రభుత్వంలో చలనం వస్తుందా లేదా అనేది చర్చానీయాంశమైంది. గులాబీ వర్సెస్ కమలం తీరుగా సాగనున్న ఈ పోరాటంతో మున్ముందు ఎలాంటి పరిణామాలు క్రియేట్ అవుతాయో చూడాలి.