వరంగల్ లోకసభ ఎన్నిక: బిజెపి, టిడిపి కూటమి అభ్యర్థి ఎన్నారై దేవయ్యనే
హైదరాబాద్: వరంగల్ లోకసభ ఉప ఎన్నికకు తెలుగుదేశం, బిజెపి కూటమి అభ్యర్థి ఖరారయ్యారు. ఎన్నారై దేవయ్యను బరిలోకి దింపాలని బిజెపి, టిడిపి కూటమి నిర్ణయించింది. వరంగల్ జిల్లా జనగామకు చెందిన ప్రముఖ వైద్యుడు రాజమౌళి పేరు తుది వరకు చర్చలో ఉన్నప్పటికీ దేవయ్యనే చివరకు ఖరారు చేశారు.
బిజెపి, టిడిపి కూటమి అభ్యర్థి ఖరారు కావడంతో వరంగల్ లోకసభ ఉప ఎన్నికకు అన్ని పార్టీల అభ్యర్థులు ఖరారైనట్లే. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నుంచి పసునూరి దయాకర్ పోటీ చేస్తున్నారు. కాగా, కాంగ్రెసు నుంచి మాజీ పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య అభ్యర్థిగా ఎంపికయ్యారు.
వామపక్షాలు ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ను బరిలోకి దించాయి. దీంతో వరంగల్ లోకసభలో చతుర్ముఖ పోటీ జరగనుంది. కాంగ్రెసు అభ్యర్థి సిరిసిల్ల రాజయ్యకు మద్దతు ఇవ్వడానికి వామపక్షాలు నిరాకరించాయి.
ఎన్నారై దేవయ్యకు టికెట్ ఇవ్వడంపై బిజెపి, తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకుల్లో కొంత అసంతృప్తి చోటు చేసుకుంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రాజీనామా చేయడం వల్ల వరంగల్ లోకసభ స్థానం ఖాళీ అయి ఉప ఎన్నిక జరుగుతోంది.