తెలంగాణ బీజేపీపై ఫైర్బ్రాండ్ ఇమేజ్: కేసీఆర్ సర్కార్ను ఢీ కొట్టేలా: బండి సంజయ్ న్యూ టీమ్
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బలపడటంపై భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం దృష్టి సారించింది. భవిష్యత్తులో ఎదుర్కొనబోయే ఎన్నికలే లక్ష్యంగా అటు ఏపీ, ఇటు తెలంగాణల్లో పార్టీని బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టింది. తెలంగాణ బీజేపీలో ఫైర్బ్రాండ్ ముద్ర ఉన్న కరీంనగర్ లోక్సభ సభ్యుడు బండి సంజయ్ కుమార్కు పార్టీ పగ్గాలను అప్పగించడంతోనే హైకమాండ్ ఉద్దేశం ఏమిటనేది స్పష్టమైంది. ఏపీలో అదే తరహా ఇమేజ్ ఉన్న సీనియర్ నేత, డైహార్డ్ లీడర్గా పేరున్న సోము వీర్రాజును పార్టీ అధ్యక్షుడిగా నియమించింది. ఈ రెండు నియామకాల వల్ల ఎలాంటి ఫలితం వస్తుందనేది తేలాల్సి ఉంది.
మాజీ ఎమ్మెల్యేలకు చోటు..
తనకు ఉన్న ఫైర్బ్రాండ్ ఇమేజ్కు అనుగుణంగా బండి సంజయ్.. కొత్త కార్యవర్గాన్ని ఎంచుకున్నారు. ఈ జాబితాను కొద్దిసేపటి కిందట విడుదల చేశారు. ఎనిమిది మందిని పార్టీ ఉపాధ్యక్షులుగా నియమించారు. వారిలో ఆరుమంది మాజీ ఎమ్మెల్యేలు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తంగా ఏడుమంది మాజీ ఎమ్మెల్యేలకు పార్టీ కొత్త కార్యవర్గ కమిటీలో స్థానం కల్పించారు. కార్యవర్గ సభ్యులు, పదాధికారులను ఎన్నుకొన్న విధానాన్ని బట్టి చూస్తే.. పార్టీ బలంగా ఉన్న జిల్లాలపై ఎక్కువగా దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. మిగిలిన జిల్లాల్లోనూ పార్టీని విస్తరించేలా ఈ జాబితాను రూపొందించినట్లు స్పష్టమౌతోంది.
పార్టీ ఉపాధ్యక్షులుగా..
కొత్త, పాత ముఖాల మేళవింపుతో కార్యవర్గాన్ని నింపారు. మొత్తం 22 మందితో తన టీమ్ను రూపొందించారు బండి సంజయ్. ఇందులో ఎనిమిది మంది ఉపాధ్యక్షులుగా ఉన్నారు. నలుగురు పార్టీ ప్రధాన కార్యదర్శులుగా మరో ఎనిమిది మందిని కార్యదర్శులుగా నియమించారు. మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ జీ విజయ రామారావు (వరంగల్), చింతల రామచంద్రా రెడ్డి (హైదరాబాద్), సాకినేని వెంకటేశ్వర రావు (సూర్యాపేట్), యెండల లక్ష్మీనారాయణ (నిజామాబాద్), ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ (మేడ్చల్), యెన్నం శ్రీనివాస రెడ్డి (మహబూబ్ నగర్)లతో పాటు నల్లగొండకు చెందిన జీ మనోహర్ రెడ్డి, యాదాద్రి భువనగిరికి చెందిన బండారు శోభారాణిలను ఉపాధ్యక్షులుగా నియమించారు.
ప్రధాన కార్యదర్శులుగా..
ప్రధాన కార్యదర్శులుగా జీ ప్రేమేందర్ రెడ్డి (వరంగల్ రూరల్), దుగ్యాల ప్రదీప్ కుమార్ (పెద్దపల్లి), బంగారు శృతి (అంబర్ పేట్), మంత్రి శ్రీనివాసులును నియమించారు. కార్యదర్శులుగా రఘునందన్ రావు (సిద్ధిపేట్), డాక్టర్ ప్రకాశ్ రెడ్డి (భాగ్యనగర్), ఎం శ్రీనివాస్ గౌడ్ (నల్లగొండ), బొమ్మా జయశ్రీ (మేడ్చల్-అర్బన్), పల్లె గంగా రెడ్డి (నిజామాబాద్), మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి (భద్రాద్రి కొత్తగూడెం), కే మాధవి (మేడ్చల్-అర్బన్), జీ ఉమారాణి (గొల్కొండ)లను నియమించారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బండారి శాంతికుమార్ను కోశాధికారిగా, సికింద్రాబాద్ మహంకాళి ప్రాంతానికి చెందిన భవర్లాల్ వర్మను సహ కశాధికారిగా నియమించారు.
Recommended Video
ఏ ఎన్నికలను ఎదుర్కోవాల్సి వచ్చినా..
తెలంగాణలో భవిష్యత్తులో ఎలాంటి ఎన్నికలను ఎదుర్కోవాల్సి వచ్చినా.. అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని ఢీ కొట్టేలా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై బీజేపీ నాయకులు ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. 2023లో అసెంబ్లీ, ఆ మరుసటి ఏడాది నిర్వహించబోయే లోక్సభ ఎన్నికల్లో పార్టీని క్షేత్రస్థాయిని బలోపేతం చేసేలా కమిటీ కూర్పునకు రూపకల్పన చేసినట్లు చెబుతున్నారు. త్వరలోనే పార్టీ కొత్త కార్యవర్గం బాధ్యతలను స్వీకరిస్తుందని తెలుస్తోంది. వరుసగా జిల్లా కమిటీలను ప్రకటిస్తారని పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు.