భారత మాతకు జై అనడానికి బాధ ఎందుకు?: వెంకయ్య సూటి ప్రశ్న
హైదరాబాద్: దేశం కోసం పనిచేసిన అందరినీ స్మరించుకోవాలని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. శనివారం ఉదయం నగరంలో కేబీఆర్ పార్కు వద్ద బీజేపీ నేతృత్వంలో శనివారం తిరంగా యాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఈ యాత్రను ప్రారంభించిన వెంకయ్యనాయుడు అనంతరం మీడియాతో మాట్లాడారు.
అందరిలో జాతీయ భావం నింపేందుకే తిరంగా యాత్ర నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. జాతీయ సమైక్యతా భావాన్ని అందరూ అలవరచుకోవాలని పిలుపునిచ్చిన ఆయన... సర్దార్ వల్లభాయ్ పటేల్ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కారణంగానే దేశం సమైక్యంగా ఉందని అన్నారు.
దేశం కోసం ఎంతోమంది మహనీయులు పోరాడారని, వారందరినీ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుతం కాశ్మీర్ లో కొనసాగుతున్న కల్లోల పరిస్థితులను ప్రస్తావించిన వెంకయ్య... కశ్మీర్ అంశాన్ని పటేల్ కు అప్పగించి ఉంటే ఇప్పుడు ఆ రాష్ట్రంలో కల్లోల పరిస్థితులు ఉత్పన్నమయ్యేవే కావని వ్యాఖ్యానించారు.
కులం, మతం పేరుతో కొంత మంది రాజకీయాలు చేస్తున్నారని, అలాంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మనమంతా భారతీయులమన్న భావన మరచిపోకూడదని అన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని, చరిత్ర మరిచిపోతే బాగుపడే పరిస్థితి లేదని వివరించారు. భారత మాతకు జై అనడానికి బాధ ఎందుకని ఆయన ప్రశ్నించారు.
దేశ విచ్ఛిన్నకారులను స్మరించుకోవడం దారుణమని అన్నారు. కేబీఆర్ పార్క్ నుంచి ప్రారంభమైన తిరంగా యాత్ర జూబ్లీహిల్స్ చెక్పోస్టు, ఫిలింనగర్ చౌరస్తా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి మీదుగా తిరిగి కేబీఆర్ పార్కు వరకు 5 కిలోమీటర్ల మేర సాగుతోంది.
తిరంగా యాత్రలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ కార్యకర్తలతోపాటు వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తిరంగా యాత్రకు ముందు దేశభక్తి ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.