లోక్ సభ ఊపును కొనసాగించాలి..! టీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపాలంటున్న బీజేపీ..!!
హైదరాబాద్: తెలంగాణ ప్రజలు బీజేపి వైపు చూస్తున్నారని, తెలంగాణలో అదికారవ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని చెప్పుకునే కమలం పార్టీ వచ్చె మున్సిపాలిటి ఎన్నికలపై దృష్టి పెట్టింది. స్థానిక పుర ఎన్నికల్లో సత్తా చూపించి బీజేపి చెప్పుకొస్తున్న వాదన నిజమనే సంకేతాలను తెలంగాణ సమాజానికి పంపాలని కమలం నేతలు పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై ప్రభావం చూపాలని కృతనిశ్చయంతో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది.
ఇందుకోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగి మరీ పావులు కదుపుతున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలతో మున్సిపల్ ఎన్నికలపై చర్చిస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలను సాధించిన బీజేపీ ఆ పట్టును నిలుపుకోవాలని చూస్తోంది. ఇందుకోసం నేతలకు అమిత్ షా టార్గెట్ విధించారని చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికలంటే ప్రధానంగా అర్బన్ ప్రాంతాలు కావడంతో బీజేపీ తమకు పట్టు దొరుకుంతుందని భావిస్తోంది.
ప్రధానంగా ఉద్యోగులు, యువత తమ పార్టీ పట్ల అనుకూలంగా ఉన్నారని బీజేపీ భావిస్తోంది. మోదీ నాయకత్వం కూడా తమ గెలుపునకు ఉపకరిస్తుందని బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమాలను నిర్వహించి ప్రజలకు చేరువకావాలని సిద్ధమయ్యారు. సెక్రటేరియట్, అసెంబ్లీ కూల్చివేతలపై తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పై గళం పెంచాలని పార్టీ నేతలకు జాతీయ అధ్యక్షుడు దిశానిర్దేశం చేశారు.
నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో వచ్చిన తెలంగాణలో ఈ మూడింటిలో అధికార పక్షం వైఫల్యాలను ఎత్తిచూపాలని సూచించారు. మరికొద్ది రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికలు జరగనుండటంతో పక్కా ప్రణాళికను కమలం పార్టీ రూపొందించుకుంది. పార్టీలోకి వలసలను మరింతగా ప్రోత్సహించాలని నిర్ణయించింది. కీలకమైన నేతలను మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ముందుగానే చేర్చుకోవాలని నిశ్చయించారు. మున్సిపల్ ఎన్నికల్లో పట్టు పెంచుకుంటే వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయవచ్చన్నది కమలనాధుల వ్యూహంగా కన్పిస్తోంది.