కరోనాపై యుద్ధానికి బీజేపీ సైతం .. కేసీఆర్ కు లేఖ రాసిన బీజేపీ చీఫ్
కరోనా పై దేశం పోరాటం సాగిస్తుంది. అయినా కరోనా కోరలు చాస్తూనే ఉంది .తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది . ఇక దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించినా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఇక తెలంగాణా రాష్ట్రంలో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ రోజుకి మొత్తం 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించి ప్రజలు బయటకు రాకుండా చూస్తుంది.
ప్రభుత్వానికి సహకారం అందిస్తామని లేఖ రాసిన బీజేపీ చీఫ్
తెలంగాణా ప్రభుత్వం కరోనా నేపధ్యంలో సామాన్యులకు సాయందించే పలు కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. ఉచిత రేషన్ అందించట , లాగే 1500రూపాయలు అందించటం చేస్తుంది. ఇక ఇలాటి విపత్తు సమయంలో పార్టీలు రాజకీయాలకు అతీతంగా స్పందిస్తున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కెసిఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ లేఖ రాశారు. కరోనా విపత్తును ఎదుర్కోవడానికి ప్రభుత్వానికి తమ పూర్తి సహకారం ఉంటుందని ఆయన ఈ లేఖ ద్వారా స్పష్టం చేశారు.
బీజేపీ కార్యకర్తల సేవలు వాడుకోవాలని లేఖ
బీజేపీ కార్యకర్తలు సేవ చెయ్యటానికి సిద్ధంగా ఉన్నారని, ప్రభుత్వానికి అవసరం అయితే వారి సేవలు వినియోగించుకోవాలని ఆయన లేఖలో పేర్కొన్నారు . రాష్ట్రంలోని లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలు కరోనా పై ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొనడానికి సిద్ధమని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి బీజేపీ కార్యకర్త కరోనా వ్యతిరేక సేవకుడిగా సేవలందించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపు నిచ్చారు.
ధరలు పెరగకుండా చూడాలని విజ్ఞప్తి
ఇక ఈ పరిస్థితిలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా దళారుల మీద చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ కు సంజయ్ తన లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. కేంద్రం ఆయుష్మాన్ భారత్ లో చేర్చిన దృష్ట్యా తెలంగాణాలో కూడా ఆయుష్మాన్ భారత్ ను అమలు చేయాలని సీఎంకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. తమ వంతు సాయం అందించటానికి ఏ సమయమైనా సిద్ధం అని ప్రకటించారు. ఇలాంటి విపత్తులను రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్న నేపధ్యంలో సీఎం కేసీఆర్ కు బీజేపీ చీఫ్ ఈ లేఖ రాశారు.