కమలం వర్సెస్ ఎంఐఎం.. మద్యలో కమలాసన్..! తీవ్ర హెచ్చరికలు జార చేసిన కాషాయ పార్టీ..!
కరీం నగర్/హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయాలు మారిపోతున్నాయి. ఎంఐఎం వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందిస్తోంది కమలం పార్టీ. రాజకీయంగా ఎలాంటి కామెంట్ చేసినా వెంటనే స్పందింస్తోంది బీజేపి. మొన్నటి వరకూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపి అద్యక్షుడు కే లక్ష్మణ్ ఎంఐఎం పార్టీ మీద తారా స్ధాయిలో విరుచుకు పడ్డారు. ఎంఐఎం నేతలు అక్బరుద్దీన్ ఓవైసీ కూడా అంతే స్ధాయిలో విరుచుకుపడుతున్నారు. ఎంఐఎం వెనక తెలంగాణా సీఎం చంద్రశేఖర్ నావు ఉన్నారని బీజేపీ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. తాజాగా అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యల పట్ల కరీంనగర్ పోలీసు కమిషనర్ వీబీ. కమలాసన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో బీజేపి వ్యతిరేకింస్తోంది.
తెలంగాణలో ముదురుతున్న వివాదాలు..! బీజేపి వర్సెస్ ఎంఐఎం..!!
కరీంనగర్ పోలీసు కమిషనర్ వీబీ. కమలాసన్ రెడ్డి బాగా పెద్ద మనిషి కాబట్టే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి క్లీన్ చిట్ ఇచ్చారని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు తెలిపారు. ఓ హిందూస్థాన్ నిన్ను వెయ్యి ముక్కలు చేస్తానని, వెయ్యి సంవత్సరాల్లో చూడని హింసను చూస్తారని అక్బర్ బహిరంగంగా విమర్శించారని అన్నారు. ఇలాంటి వ్యక్తి కమలాసన్ రెడ్డికి అమయకుడిలా కనిపిస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు. టిఆర్ఎస్ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ప్రజలు ఊరుకోరన్నారు. ఈ చర్యలకి ప్రతిచర్యలు తప్పకుండా ఉంటాయని హెచ్చరించారు.
కరీంనగర్ కమీషనర్ కి బీజేపి హెచ్చరికలు..! హద్దు దాటొద్దంటూ చురకలు..!!
తమ వ్యాఖ్యలను కమలాసన్ రెడ్డి ఒక హెచ్చరికగా తీసుకోవాలని సూచించారు. అధికారులకు పరిధి ఉంటుందని, దాటి పనిచేస్తే బాగుండదని తెలిపారు. రాజకీయ పరమైన ప్రెస్ మీట్ లకు కమీషనర్ ఎందుకు రియాక్ట్ అవుతున్నారో? అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన విద్యార్థులను, ఉద్యోగులను కమలాసన్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. చిన్నచిన్న పిల్లలపై రౌడీషీట్లను ఓపెన్ చేస్తున్నారన్నారు. ఇలాంటి అధికారులకు బీజేపీ రాష్ట్రశాఖ తరపున హెచ్చరిక జారీచేస్తున్నామన్నారు.
మనోభావాలను రెచ్చగొడితే సహించేది లేదు..! మండిపడుతున్న బీజేపి..!!
అక్బరుద్దీన్ విద్వేషాన్ని రెచ్చ గొట్టే స్పీచ్ లు ఇవ్వడంలో దిట్టని, కరీంనగర్ లో ఆయన మాట్లాడిన మాటలు హిందువుల మనోభావాలు కించపరిచేలా ఉన్నాయన్నారు. ఎంఐఎం సోదరులకు పెద్దన్నగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. అందుకే ఆయన వ్యాఖ్యలపై ప్రభుత్వం, టిఆర్ ఎస్ స్పందించడం లేదు. రౌడీలకు, గూండాలకు తెలంగాణ ప్రభుత్వం అద్దం పడుతోందన్నారు. అక్బరుద్దీన్ 15 నిమిషాల విద్వేష వ్యాఖ్యలపై వివరణ ఏంటో కరీంనగర్ పోలీస్ కమీషనర్ చెప్పాలన్నారు.
పోలీసులకు ఉదాసీనంగా ఉంటే ఎలా..! అన్నీ గమనిస్తున్నామంటున్న కమలం పార్టీ..!!
కమలాసన్ రెడ్డి ఐపిఎస్ లా కాకుండా టిఆర్ఎస్ కార్యకర్త మాదిరి పనిచేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో పోలీసులు తీర్పు చెప్పరు, వాటికి కోర్టులున్నాయి. అక్బరుద్దీన్ వ్యాఖ్యల విషయంలో కేసు నమోదు చేయకుండా కమలాసన్ రెడ్డి బాాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తన పరిధిని దాటి అధికార ఉల్లంఘన పాల్పడుతున్న వారిపై ప్రధాని కార్యాలయం లో ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. అదే విధంగా కేంద్రంలోని ఐపీఎస్ అధికారుల వ్యవహారాలను పర్యవేక్షించే డిఓపిటి కి ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు.