తెలంగాణలో కారుతో కమలం..! ముందస్తు ఖాయమైతే పొత్తు తప్పదంటున్న బాస్..!!
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో ఊహించని ట్విస్ట్ జరగబోతోంది. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సహా ప్రధాని మోదీ వరకూ కమల జపం చేసే గులాబీ నాయకులు రాష్ట్రంలో మాత్రం అదే భారతీయ జనతా పార్టీని పది అడుగుల లోతు బొందపెట్టే ప్రయత్నం చేస్తుంటుంది. ప్రాజెక్టుల్లో, సంక్షేమ పథకాల్లో అవినీతి జరుగుతోందంటూ స్థానికి బీజేపి నేతలు ధర్నాలు, నిరశనలు నిర్వహిస్తుంటే కేంద్ర మంత్రులు మాత్రం కేసీఆర్ పథకాలు శభాష్, దేశానికే ఆదర్శం అంటూ కితాబిచ్చి వెళ్తుంటారు. దీంతో తెలంగాణ బీజేపి పరిస్థితి ఏడ్చి కళ్లుతుడుచుకున్న చందంగా తయారయింది.
తెలంగాణలో ఊహించని పొత్తు..! టీఆర్ఎస్ బీజేపీ ములాఖత్..!
కానీ ముందస్తు ఎన్నికల హడావిడితో ఆ రెండు పార్టీల మద్య ఊహించని సంఘటన చోటుచేసుకోబోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ముందస్తు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే తెలంగాణలో కారుకు కమలం పువ్యులను అలంకరించుకునే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. మోదీ తో కేసీఆర్ ఇంత సాన్నిహిత్యం వలక మోస్తున్నప్పటికి ఆయన ఛరిష్మా ఎంతకాలం ఉంటుందనే అంశం పట్ల అప్రమత్తంగా ఉన్నట్టు తెలుస్తోంది. అంటే మోదీ దీపం ఉండగానే ఎన్నికల ఇల్లు చక్కబెట్టుకునేందుకు చంద్రశేఖర్ రావు తెగ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
Recommended Video
ముందస్తు మీరు ఖాయం చేయండి..! రాష్ట్ర బీజేపీని నేను చూసుకుంటా..! మోదీతో కేసీఆర్..
సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని, కేంద్ర మంత్రుల్ని కలిసి కొన్ని గంటలు కూడా గడవక ముందే ఢిల్లీలో ఎంపీ వినోద్, హైదరాబాద్లో మంత్రులు కేటీఆర్, నాయిని, ముందస్తు ఆలోచన నిజమేనని తేల్చేశారు. ఈసీ నుంచి సానుకూల సంకేతాలు అందితే వచ్చే నెల మొదటి వారంలో మంత్రివర్గం సమావేశమై శాసనసభ రద్దుకు నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. ఇదంతా బాగానే అసలు తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరపాలని కేసీఆర్ ఎందుకు అనుకుంటున్నారు. గులాబీ పార్టీకి అంతా అనుకూలంగా ఉందని చెప్పుకొస్తున్నప్పుడు కేంద్ర స్థాయిలో ఎందుకు ఈ ఉరుకులు పరుగులనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
మోదీ మీదే ఆశలు..! లేకపోతే కార్ కు స్పీడ్ బ్రేకర్లు తప్పవు..
తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాయి. దీంతో తెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా సాగుతోంది. వాస్తవానికి జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల భావించినా దానికి కొన్ని రాష్ట్రాల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ ఆలోచన కాస్తా విరమించుకున్నారు కేంద్ర పెద్దలు. ఇక జమిలి ఉండకపోవచ్చన్న నేపథ్యంలో తెలంగాణ సీఎం రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అసలు కేసీఆర్ ముందస్తు ప్రతిపాదన తీసుకురావడానికి మోదీ ప్రభావం ఎంతగానో ఉందని తెలుస్తోంది.
పరస్పర ఒప్పందం.! సహజ ఓటు బ్యాంకుకు భగం కలగకుండా వ్యూహం..!!
ఇటీవల పార్టీ సమావేశంలో ‘మోదీ ప్రాభవం నానాటికీ తగ్గుతోంది. ఏప్రిల్ నాటికి ఆయనపై వ్యతిరేకత మరింత పెరిగిపోవచ్చు. అది కాంగ్రెస్కు లాభిస్తే సార్వత్రిక ఎన్నికల్లో గులాబీ పార్టీకి ఇబ్బంది కావొచ్చు. అందువల్ల అసెంబ్లీని విడగొట్టి ముందు ఎన్నికలకు వెళ్లడమే మంచిది' అని చంద్రశేఖర్ రావు ముఖ్య నేతలతో అన్నట్టు సమాచారం. ఈ కారణంగానే కేసీఆర్ తెలంగాణలో ముందస్తు నిర్ణయం తీసుకున్నారని టాక్. ఇందుకోసం కేసీఆర్ తనదైన లెక్కతో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమౌతున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగి, ఈసీ ఒప్పుకుంటే డిసెంబర్లో ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.అంతే కాకుండా కేసీఆర్ మోదీ మద్యన పొత్తు అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు మార్గం సుగమం చేస్తే తెలంగాణలో బీజెపీకి 15లేదా 20సీట్లు కేటాయించే దిశగా ఒప్పందం కూడా చేసుకున్నట్లు ప్రగతి భవన్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నట్టు తెలుస్తోంది.