షా వ్యూహం: విజయశాంతి, సురేష్ రెడ్డిలకు గాలం.. లెఫ్ట్తో పవన్?
వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ను దెబ్బ తీయడానికి కాంగ్రెసు, బిజెపిలు వ్యూహరచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇతర పార్టీల నాయకులకు వారు గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ సమీకరణాలు జోరుగా మారుతున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల గడువు ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే గెలుపు గుర్రాల కోసం బిజెపి ఓ వైపు, కాంగ్రెసు మరో వైపు అన్వేషణ ప్రారంభించాయి. తెలుగుదేశం పార్టీలోని బలమైన నాయకులకు కాంగ్రెసు పార్టీ ఎర వేస్తున్నట్లు సమాచారం.
అదే సమయంలో కాంగ్రెసులోని నాయకులకు బిజెపి గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాదుతో పాటు తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో బలమైన నాయకుల కోసం బిజెపి అన్వేషణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. కొత్త నాయకత్వ సమీకరణాలతో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును వచ్చే ఎన్నికల్లో దెబ్బ తీయాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.
కాంగ్రెసులో ఉన్న బలమైన నాయకులను ఇప్పటికే బిజెపి గుర్తించినట్లు తెలుస్తోంది. వారితో సంప్రదింపులు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే, వారి చేరిక ఇంకా కొలిక్కి రాలేదని తెలుస్తోంది. మరోవైపు పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి తెలంగాణలో నాయకత్వం వహించి, వామపక్షాలను ఏకతాటి మీదికి తెచ్చే ప్రయత్నంలో గద్దర్ ఉన్నట్లు తెలుస్తోంది.
విజయశాంతి కోసం బిజెపి...
మాజీ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి కోసం బిజెపి నాయకత్వం ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మొదట్లో ఆమె బిజెపిలోనే ఉన్నప్పటికీ ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరి పార్లమెంటు సభ్యురాలిగా విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెసులో చేరి, శాసనసభకు పోటీ చేసి ఓడిపోయారు. పాత అనుబంధాన్ని ఆసరా చేసుకుని బిజెపి ఆమెను తమ పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
సురేష్ రెడ్డి కోసం బిజెపి ప్రయత్నాలు...
ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్గా పనిచేసిన కాంగ్రెసు నాయకుడు సురేష్ రెడ్డికి బిజెపి గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గంపై దృష్టి పెట్టిన బిజెపి ఆయనను సంప్రదించినట్లు ప్రచారం సాగుతోంది. అయితే, ఆయన నుంచి ఇప్పటి వరకు సానుకూల స్పందన రాలేదని సమాచారం. అదే రీతిలో మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ ప్రజా ప్రతినిధిని కూడా బిజెపి సంప్రదించినట్లు చెబుతున్నారు. పార్టీలో కార్యకలాపాల్లో చురుగ్గా లేకపోయినప్పటికీ నాగం జనార్దన్ రెడ్డి ఇంకా బిజెపిలోనే ఉన్నారు.
పవన్ జనసేనకు గద్దర్
పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి గద్దర్ నాయకత్వం వహించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో రెండు వామపక్షాలను ఏకం చేసి వారితో కలిసి ముందుకు సాగాలనే ఉద్దేశంతో గద్దర్ ఉన్నట్లు తెలుస్తోంది. సిపిఐ, సిపిఎం నాయకులు గద్దర్ పట్ల సానుకూలంగానే ఉన్నారు. ఇంతకు ముందు వరంగల్ లోకసభ ఉప ఎన్నికలో గద్దర్ను ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టే ప్రయత్నాలు ఆ పార్టీలు చేశాయి. అయితే, చివరి నిమిషంలో సమీకరణాలు మారడంతో గద్దర్ పోటీకి దిగలేదు.
కాంగ్రెసు నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా...
తమ పార్టీలోకి వచ్చే తెలుగుదేశం పార్టీ నాయకులను కాంగ్రెసు పార్టీ ఇప్పటికే గుర్తించి, వారితో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. అయితే, వచ్చే ఎన్నికల్లో సీటు గ్యారంటీ ఇస్తే తాము వస్తామని కొంత మంది చెప్పినట్లు సమాచారం. అయితే, అది తన చేతుల్లో లేదని, రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. అయితే, టికెట్లు ఖరారు చేస్తే టిడిపిలోంచి తమ పార్టీలోకి వచ్చే నాయకుల జాబితాను తయారు చేసి త్వరలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాహుల్ గాంధీ ముందు ఉంచుతారని అంటున్నారు. ఇప్పటికే, 60 నుంచి 70 మంది అభ్యర్థులను ఖరారు చేసి, పనిచేసుకోవాల్సిందిగా వారికి సూచించినట్లు కూడా చెబుతున్నారు. (