ఇందూరులో అరవింద్ టికెట్లు అమ్ముకున్నారు, బీజేపీ ఆఫీసు వద్ద శ్రేణుల ఆందోళన
నిజామాబాద్ మున్సిపల్ టికెట్ల కేటాయింపుపై అసంతృప్త నేతలు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిరసన చేపట్టారు. ఎంపీ ధర్మపురి అరవింద్, అతని ప్రధాన అనుచరుడు బైసాల లక్ష్మీనర్సయ్య టికెట్లను అమ్ముకొన్నారని ఆరోపించారు. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా.. కొత్త మొహాలకు టికెట్లు కేటాయిస్తున్నారని మండిపడ్డారు.
మున్సిపోల్స్ సహా ఇతర అంశాలపై చర్చించేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్, ఇంచార్జీ కృష్ణ దాస్ సమావేశమయ్యారు. వివిధ అంశాలపై వారు చర్చిస్తోండగానే.. అసంతృప్త నేతలు నినాదాలతో హోరెత్తించారు. అరవింద్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టికెట్లు అమ్ముకున్నారని, ఇది సరికాదని, పార్టీ కోసం శ్రమించిన వారికి టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
అసంతృప్త నేతల్లో నిజామాబాద్ పట్టణ అధ్యక్షులు కూడా ఉండటం విశేషం. తనను సంప్రదించకుండానే టికెట్లు ఖరారు చేశారని మండిపడ్డారు. అరవింద్, లక్ష్మీనర్సయ్య కలిసి టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. నామినేషన్ల సమర్పించే గడువు నిన్నటితో ముగిసినందున.. శనివారం వారు ఆందోళన చేపట్టడం విశేషం. విషయాన్ని పార్టీ హైకమాండ్ దృష్టిసారించినా.. టికెట్ల కేటాయింపు మార్చలేని పరిస్థితి నెలకొంది