మంత్రి కేటీఆర్కు బీజేపీ నిరసన సెగ... గో బ్యాక్ అంటూ నినాదాలు... కాషాయ కార్యకర్తల అరెస్ట్...
తెలంగాణ ఐటీ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్కు బీజేపీ నిరసన సెగ తగిలింది. శనివారం(జనవరి 9) హైదరాబాద్లోని బాగ్లింగంపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొనగా బీజేపీ నేతలు ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొత్తగా గెలిచిన కార్పోరేటర్ను కార్యక్రమానికి ఆహ్వానించకుండా ప్రోటోకాల్ విస్మరించారని కేటీఆర్పై స్థానిక బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ డౌన్ డౌన్.. గో బ్యాక్.. అంటూ నినాదాలు చేశారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో
హైదరాబాద్ బాగ్లింగంపల్లి పరిధిలోని లంబాడితండాలో మంత్రి కేటీఆర్ శనివారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించారు. 120 మంది లబ్దిదారులకు కొత్త ఇళ్లను అందించారు. అయితే కొత్తగా గెలిచిన బాగ్లింగంపల్లి కార్పోరేటర్ను ఈ కార్యక్రమానికి ఎందుకు ఆహ్వానించలేదని బీజేపీ నేతలు నిరసనకు దిగారు. దీంతో మంత్రి కేటీఆర్,మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పాత పాలకమండలి గడువు ఇంకా తీరనందునా పాత కార్పోరేటర్నే ఆహ్వానించినట్లు మంత్రులు చెప్పారు. అయినప్పటికీ బీజేపీ నేతలు శాంతించలేదు. కేటీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
Recommended Video
బీజేపీ కార్యకర్తల అరెస్ట్
బీజేపీ కార్యకర్తలు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి అక్కడినుంచి తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు,వారికి మధ్య వాగ్వాదం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఆ సమయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. మంత్రి కేటీఆర్తో కలిసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. జీహెచ్ఎంసీలో కొత్త పాలకమండలిని ఏర్పాటు చేయాలని... కార్పోరేటర్లుగా గెలిచి నెల రోజులవుతున్నా తమకు ప్రోటోకాల్ ఇవ్వకపోవడమేంటని కొద్దిరోజులుగా నగర బీజేపీ కార్పోరేటర్లు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రగతి భవన్ను కూడా ముట్టడించే ప్రయత్నం చేశారు.
సమన్వయంతో పనిచేద్దామన్న కేటీఆర్...
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... 'ఎన్నికల సమయంలో ఎవరి వాదన వారు చెప్పాం. ఎన్నికలు ముగిశాక ప్రజా సంక్షేమం,అభివృద్ది తప్ప మరో పంచాయతీ అవసరం లేదు. కలిసి మెలిసి సమన్వయంతో పనిచేద్దాం. రాజకీయాల్లో పోటీతత్వం ఉండాలి కానీ అనవసర పంచాయతీలు వద్దు. ప్రజలు ఇలాంటి వైఖరిని హర్షించరు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందుకు సాగితేనే ప్రజలు హర్షిస్తారు.' అని పేర్కొన్నారు.
పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన..
బాగ్లింగంపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ముందు దోమలగూడలో రూ.9.90కోట్ల వ్యయంతో నిర్మించనున్న జీహెచ్ఎంసీ జోనల్,డిప్యూటీ కమిషనర్ కార్యాలయాలకు మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం నారాయణగూడలో రూ.4కోట్ల వ్యయంతో నాలుగు అంతస్తుల్లో నిర్మించ తలపెట్టిన మోడల్ కూరగాయాల మార్కెట్కు కేటీఆర్ భూమి పూజ నిర్వహించారు.