సిరిసిల్లలో కార్పోరేట్ను తలదన్నే స్కూల్... ప్రారంభించిన కేటీఆర్... మంత్రి పర్యటనలో ఉద్రిక్తత...
తెలంగాణ ఐటీ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ శ్రేణులు మంత్రి కాన్వాయ్ని అడ్డుకునేందుకు యత్నించడంతో పోలీసులకు,వారికి మధ్య తీవ్ర వాగ్వాదం,ఘర్షణ చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అక్కడినుంచి తరలించారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్కు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు.
రామ మందిర నిర్మాణం కోసం బీజేపీ శ్రేణులు వసూలు చేస్తున్న చందాలకు లెక్కలు చూపించాలని ఎమ్మెల్యే ధర్మారెడ్డి డిమాండ్ చేయడంతో బీజేపీ శ్రేణులు ఆయన నివాసంపై దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. రాళ్లు,కర్రలతో ఆయన ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడులకు దిగారు. ఈ దాడిపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. టీఆర్ఎస్ కార్యకర్తలకు ఓపిక నశిస్తే బీజేపీ నేతలు బయట తిరగలేరని హెచ్చరించారు. ప్రజాజాస్వామ్యంలో తమ వాదనతో ప్రజలను ఒప్పించడం చేతకాక, ఇతర పార్టీల నేతలపై బీజేపీ భౌతిక దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు.
కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిరిసిల్ల పర్యటనలో బీజేపీ శ్రేణులు ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
కాగా,కార్పోరేట్ స్కూల్ స్థాయికి ధీటుగా ఆధునీకరించిన సిరిసిల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి కేటీఆర్ సోమవారం(ఫిబ్రవరి 1) ప్రారంభించారు.పిల్లలను తల్లిదండ్రులు పోత్సహించాలని, తన తల్లిదండ్రుల ప్రోత్సాహమే తనను ఇంతటివాడిని చేసిందని ఈ సందర్బంగా పేర్కొన్నారు. తన ప్రాథమిక విద్యను చింతమడకలోని ప్రభుత్వ పాఠశాల నుంచే ప్రారంభించానని.. తర్వాత పాఠశాలు, కళాశాలలు మారుతూ అమెరికాలో విద్యనభ్యసించే స్థాయికి వెళ్లానని గుర్తుచేసుకున్నారు. విద్యార్థులు ఉద్యోగం కోసం చదవకుండా పది మందికి ఉపాధినిచ్చే చదువులు చదవాలని సూచించారు.విద్యార్థులు క్రీడల్లో కూడా రాణించాలని చెప్పారు.
1960లో ఏర్పాటైన సిరిసిల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎంతో మందిని ప్రయోజకులను చేసిందన్నారు. పలు సేవా సంస్థల సహకారంతో కరోనా సమయంలో ఈ పాఠశాలను పునర్నిర్మించామని తెలిపారు. నాలుగు వందల మంది ఒకేసారి భోజనం చేసే విధంగా డైనింగ్ హాల్, కంప్యూటర్ ల్యాబ్, 39 తరగతి గదులతో భవనాన్ని నిర్మించామన్నారు. ఇలాంటి పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు కావాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పారు.
రాష్ట్రంలో 945 గురుకులాలను ఏర్పాటు చేశామని, ఒక్కో విద్యార్థిపై రూ.1.25 లక్షలు ఖర్చుచేస్తున్నామని వెల్లడించారు. విదేశాల్లో చదువుకునేందుకు రూ.29 లక్షల విద్యా రుణం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు.
Visuals of MA&UD Minister and Sircilla MLA Sri @KTRTRS inaugurating the newly renovated Zilla Parishad High School at Geeta Nagar in Sircilla. pic.twitter.com/8fCHpx2NLF
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 1, 2021