మేం చేయం, ప్రజల కోసం మీరు చెప్తే మేం చేయాలా, మా ఇష్టం: కెసిఆర్ తీరుపై లక్ష్మణ్
హైదరాబాద్: మేం ఇచ్చిన హామీని నిలబెట్టుకోం, ప్రజా సమస్యలపై మీరు ప్రశ్నిస్తే మేం తలొగ్గాలా, మా ఇష్టం ఉన్నది చేస్తామన్న విధంగా అదికార టిఆర్ఎస్ పార్టీ తీరు ఉందని తెలంగాణ బిజెపి శాసన సభా పక్ష నేత డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు.
సోమవారం విపక్ష సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత వారు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీలో ఇది చీకటి రోజు అన్నారు. పోరాటాల సాధించిన తెలంగాణలో.. ప్రజల ఆశల పైన సభ నీళ్లు జల్లిందన్నారు.
సభ మేం చెప్పినట్లుగానే జరగాలని, మేం చెప్పిందే చేస్తామని, ప్రజల తరఫున మీరెవరు మాట్లాడేందుకు అనేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ రోజు... రైతులను, తెలంగాణ ప్రజలను అవమానించారని లక్ష్మణ్ అన్నారు.
సభలోనే ఆయన మీరు గొంతెమ్మ కోర్కెలు కోరితే నేను తల ఒగ్గాలా అని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారని, రైతు రుణమాఫీని ఒకేసారి చేయాలంటే అది గొంతెమ్మ కోరిక ఎలా అవుతుందని అభిప్రాయపడ్డారు. రైతులను ముఖ్యమంత్రి అవమానించారన్నారు.
ప్రభుత్వం ప్రకటించిన పరిహారం చేనేత కార్మికులకు కూడా వర్తింప చేయాలని మేం డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రజా సమస్యల పైన, రైతు సమస్యల పైన మేం ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నిస్తే మమ్మల్ని బుల్డోజ్ చేస్తారా అని ప్రశ్నించారు.
రైతుల సమస్యల కోసం పెట్టిన డిమాండ్ పైన మేం రాజీపడే ప్రసక్తే లేదన్నారు. మేం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమన్నారు. అవసరమైతే అన్ని పార్టీలను కలుపుకొని వెళ్తామన్నారు. సభలో కూర్చొని మజ్లిస్ పార్టీ అధికార పార్టీకి వత్తాసు పలుకుతోందన్నారు. రైతుల సమస్యల పైన మజ్లిస్కు చిత్తశుద్ధి లేదన్నారు.
మేం ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని, ప్రజా సమస్యల పైన మీరు చెబితే మేం తలొగ్గాలా, మా ఇష్టం ఉన్నది మేం చేస్తాం అన్న చందంగా కెసిఆర్ తీరు ఉందని లక్ష్మణ్ మండిపడ్డారు. రైతు సమస్యలు, ప్రజా సమస్యల పైన విపక్షాలు అన్నీ ఒకటే డిమాండ్ చేస్తున్నాయన్నారు.
ప్రజల కోసం, రైతుల కోసం ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండును నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పారు. తమను సస్పెండ్ చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వానికి నిలదీత తప్పదని హెచ్చరించారు.
ప్రభుత్వం తీరుపై జానారెడ్డి ఆగ్రహం
రైతులు ఆత్మహత్యలు, రుణమాఫీ పైన చర్చ పూర్తయినట్లుగా ప్రభుత్వం చెబుతోందని కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత జానా రెడ్డి మండిపడ్డారు. ప్రజా సమస్యల పైన ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికం అన్నారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు.
రైతు ఆత్మహత్యలు, రుణమాఫీ విషయమై ప్రజల బాధను అసెంబ్లీలో చెప్పామని, సరైన సమాధానం కోసం తాము పట్టుబట్టామన్నారు. గురువారం నాడు హఠాత్తుగా సభను వాయిదా వేసి వెళ్లారన్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలను సస్పెండ్ చేశారన్నారు.
చరిత్రలో ఎన్నడూ ఇలాంటి సంఘటన జరగలేదన్నారు. రైతులకు భరోసా ఇచ్చే ప్రయత్నాలు ప్రభుత్వం చేయడం లేదన్నారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తే ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. రుణమాఫీ పైన రైతులకు భరోసా ఇవ్వడం లేదన్నారు.
రైతులకు రుణమాఫీని ఒకేసారి ఇచ్చి వారికి ఊరట ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. మాకు నిబంధనలు తెలియవా అన్నారు. నిబంధనల ప్రకారమే మేం డిమాండ్ చేశామన్నారు. రైతుల వెతలు మేం సభలో వినిపించే ప్రయత్నం చేశామన్నారు. ఒకేసారి రుణమాఫీ చేసే వరకు పోరాడుతామని చెప్పారు.