సింగరేణి బొగ్గు గనిలో పేలుడు: ఐదుగురికి గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం
మంచిర్యాల: జిల్లాలోని శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి ఆర్కే 5బీ గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. గనిలో బొగ్గును వెలికితీసేందుకు పలుచోట్ల పేలుడు పదార్థాలు పెట్టారు. కేబుల్వర్ కనెక్షన్ ఇచ్చే క్రమంలో బ్లాస్టింగ్ మిస్ ఫైర్ అయ్యింది. దీంతో పేలుడు సంభవించింది.
ఈ ప్రమాదంలో ఐదుగురు సింగరేణి కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని రత్నం, లింగయ్య, రాజం, సుమన్, శ్రీకాంత్గా గుర్తించారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించే ఏర్పాటు చేస్తోంది సింగరేణి యాజమాన్యం.
Recommended Video
ప్రమాద ఘటనపై మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత స్పందించారు. ప్రమాద ఘటన బాధాకరమని అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.