బొల్లారం పారిశ్రామికవాడలో పేలుడు: మహిళ మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం
సంగారెడ్డి: జిల్లాలోని ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో ఆదివారం సాయంత్రం పేలుడు సంభవించింది. పారిశ్రామికవాడలోని ఎస్వైఎస్ ఎలక్ట్రానిక్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలో ఆదివారం నాలుగున్నర గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాద ఘటనలో రాధిక అనే కార్మికులు మృతి చెందింది. విజయ్ కుమార్ యాదవ్, అన్వేశ్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కాగా, మరో ముగ్గురు కార్మికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పేలుడు ధాటికి పరిశ్రమలోని గోడలు బీటలు వారి, పైకప్పు లేచిపోయినట్లు కార్మికులు తెలిపారు.
పరిశ్రమలోని కాయల్స్ వేడి చేసే బ్లాక్లో ఉష్ణోగ్రత పెరగడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు తెలిపారు. గాయపడినవారిని బాచుపల్లిలోని మమత ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఐడీఏ బొల్లారం పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.