ఫార్మసీ పరిశ్రమలో రియాక్టర్ పేలుడు: ఆరుగురు సజీవ దహనం
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మాంకాల్ వద్ద రసాయన పరిశ్రమలో సోమవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. అసిత పరిశ్రమలో రియాక్టర్ పేలి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
మృతులను ఛత్తీస్గడ్కు చెందిన వారిగా గుర్తించారు. గాయపడిన మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. ప్రమాద సమయంలో సుమారు 100 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంపై ఇప్పటి వరకు ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించలేదు.
ఫర్నీచర్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం
సికింద్రాబాద్లోని ఓ ప్రముఖ ఫర్నీచర్ దుకాణంలో శనివారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగి సుమారు రూ.2 కోట్ల వరకు ఆస్తినష్టం సంభవించింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్ మంజు థియేటర్ ఎదురుగా ఉండే క్యాచి ఫర్నిచర్ షోరూమ్ను మహేంద్రహిల్స్కు చెందిన రణ్బీర్సింగ్ గాంధీ నిర్వహిస్తున్నారు.
శనివారం రాత్రి షోరూమ్ను మూసివేసి వెళ్లిపోయారు. అర్ధరాత్రి రాత్రి 12.30, ఒంటి గంట ప్రాంతంలో షోరూమ్కు చెందిన 3వ అంతస్తు నుంచి పెద్ద ఎత్తున మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు.
నగరంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి 7 అగ్నిమాపక శకటాలను, వాటర్ ట్యాంకర్లను రప్పించారు. మంటలు అదుపులోకి వచ్చే సమయానికి భవనంలోని రెండు, మూడు, నాలుగు అంతస్తుల్లోని షోరూమ్ మొత్తం తగలబడి ఫర్నిచర్ అంతా బూడిదైంది.