ఫెడరల్ ఫ్రంట్ను ఆశీర్వదించండి : సమస్యే లేకుండా చేస్తానని కేసీఆర్ భరోసా
నిజామాబాద్ : గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినట్లే పార్లమెంట్ ఎన్నికల్లో తీర్పునివ్వాలని ప్రజలను కోరారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలోని 17 స్థానాల్లో విజయం సాధిస్తే .. కేంద్రంలో చక్కం తిప్పొచ్చని పేర్కొన్నారు. నిధులు రాబట్టుకోవచ్చని, ప్రాజెక్టులకు జాతీయ హోదా .. వివిధ సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చని తెలిపారు. మంగళవారం సాయంత్రం నిజామాబాద్లో ఆశేష జనవాహిని మధ్య ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
వాటి పేరుతో ఓట్లు అడుగు : ప్రియాంకగాంధీపై ఉమాభారతి సెటైర్లు
ఇందూరు జెడ్పీపై గులాబీ జెండా
ప్రత్యేక రాష్ట్రం కోసం ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీకి నిజామాబాద్ అండగా నిలిచిందని గుర్తుచేశారు కేసీఆర్. 2001లో ఉద్యమ ప్రారంభ సమయంలో ఇందూరు జెడ్పీ పీఠంపై గులాబీ జెండా ఎగిరిందని తెలిపారు. ఇక అప్పటినుంచి అప్రతిహతంగా తెలంగాణ ఉద్యమం కొనసాగి .. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నేరవేర్చేందుకు దోహదపడిందని పేర్కొన్నారు.
సబ్బండవర్గాలకు చేయూత
ఆంధ్రా వలసవాదుల పాలన నుంచి విముక్తి పొంది స్వరాష్ట్రం సాధించాక తెలంగాణ పురోగమన దిశలో పయనిస్తోందని చెప్పారు కేసీఆర్. సంక్షేమ రంగానికి ప్రాధాన్యం ఇచ్చామన్న ఆయన .. రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వని ఎర్రజొన్న బకాయిలను తీర్చింది టీఆర్ఎస్ సర్కారేనని చెప్పారు కేసీఆర్. కొందరు కాంగ్రెస్ నేతలు ఆర్మూరులో రైతులతో ధర్నా నిర్వహించారని ఆరోపించారాయన.
కార్మికులకు ఆర్థిక భరోసా
దేశంలోని 16 రాష్ట్రాల్లో 52.32 లక్షల మంది బీడీ కార్మికులు ఉంటే .. తెలంగాణలో 4.5 లక్షల మంది ఉన్నారని చెప్పారు కేసీఆర్. గత ప్రభుత్వాలు కార్మికుల బాగోగులు పట్టించుకోలేదని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనివిధంగా కార్మికులకు పింఛను ఇస్తున్నామని తెలిపారు. అలాగే సంచార జాతుల భవిష్యత్ కోసం వెయ్యి కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు.
సంచారజాతులకు సంక్షేమ నిధి
దేశం చూపు తెలంగాణ వైపు ఉన్నదని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నారాయన. దేశానికి పట్టిన దరిద్రం కాంగ్రెస్, బీజేపీలేనని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలేని ఫ్రంట్ రావాలని .. అందుకోసం కృషి చేస్తున్నట్టు వివరించారు.
కాపాలదారు రాజకీయాలేంటీ ?
కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ .. ప్రధానిని దొంగ కాపాలదారు అని విమర్శిస్తారు, రాహుల్ను మోదీ సహా బీజేపీ నేతలు దుయ్యబడతారు .. వీరా మన నేతలు, ప్రధాని పదవీ చేపట్టే అర్హత వీరికి ఉందా అని ప్రశ్నించారు కేసీఆర్. వీరి చేష్టలతో మిగతా దేశాల్లో పరువుపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.