వడదెబ్బ, చర్మంపై పొక్కులు!: ఈరోజు ఎండలో తిరుగొద్దని హెచ్చరిక
సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల తీవ్రత మంగళవారం మూడు రెట్ల వరకూ అధికంగా ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు బయట తిరగకుంటే మంచిదని వాతావరణ శాఖ హెచ్చరించింది.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటల తర్వాత జనం రోడ్డుపైకి రావాలంటేనే భయపడిపోతున్నారు. 40డిగ్రీలకు పైగా ఎండలు ఉండటంతో ప్రజలు తమ ప్రయాణాలను, పనులనూ ఉదయం పూటే పూర్తి చేసేందుకు మొగ్గుచూపుతున్నారు.
కాగా, సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల తీవ్రత మంగళవారం మూడు రెట్ల వరకూ అధికంగా ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు బయట తిరగకుంటే మంచిదని వాతావరణ శాఖ హెచ్చరించింది.
సాధారణంగా సూర్యరశ్మిలో 3 నుంచి 5 శాతం వరకూ బ్లూ రేస్ ఉంటాయని, కానీ వాతావరణ మార్పుల నేపథ్యంలో మంగళవారం నాడు బ్లూ రేస్ 11 శాతం దాటుతాయని తెలిపారు. దీని ప్రభావం సాయంత్రం 5 గంటల వరకూ ఉంటుందని వివరించారు.
ఈ కిరణాల ధాటికి చర్మంపై పొక్కులు వచ్చే ప్రమాదం ఉందని, వడదెబ్బ బారిన పడవచ్చని హెచ్చరించారు. మధ్యాహ్నం వేళ ఎండల్లో తిరగవద్దని, తప్పనిసరైన పరిస్థితుల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.