హైదరాబాద్ బిట్స్ పిలానీ విద్యార్థి ఆత్మహత్య: బ్లూవేల్ గేమా, ప్రేమ వ్యవహారమా?
హైదరాబాద్: రాజేంద్రనగర్ సన్ సిటీలో బిట్స్ పిలానీ విద్యార్థి వరుణ్ (19) ఆత్మహత్య చేసుకున్నాడు. అతను బ్లూ వేల్ గేమ్కు బానిస కావడం వల్లే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. ప్లాస్టిక్ కవర్ను మెడకు చుట్టుకొని రెండు రోజుల క్రితం ప్రాణాలు తీసుకున్నాడు.
వరుణ్ నాలుగు రోజుల నుంచి గదిలోనే ఉంటున్నాడు. ల్యాప్ టాప్లో గేమ్ ఆడుతున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఆ గేమ్ బ్లూవేల్ గేమ్ అయి ఉంటుందని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
బ్లూవేల్ గేమ్ కారణంగా ఆత్మహత్య అని
రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సన్ సిటీలో ఆత్మహత్య చేసుకున్న బిట్స్ పిలానీ ఇంజినీరింగ్ విద్యార్థి వరుణ్ కేసును పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. వరుణ్ వీడియో గేమ్లు బాగా ఆడేవాడని సన్నిహితులు చెప్పడంతో బ్లూ వేల్ గేమ్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని తొలుత అనుమానించారు.
పలుమార్లు మందలించిన తల్లి
మూడు నాలుగు రోజుల పాటు గదిలో ల్యాప్టాప్కు అతుక్కుపోవడంతో తల్లి అతనిని పలుమార్లు మందలించారు. అతనిని మందలించి భోజనం పెట్టినట్లుగా చెబుతున్నారు. మరోవైపు విషయం తెలిసిన తండ్రి ఇంటర్ నెట్ కనెక్షన్ తొలగించారు. అయితే తన మొబైల్ డాటా హాట్ స్పాట్ ద్వారా ల్యాప్టాప్కు అనుసంధానించి మళ్లీ నెట్ వినియోగించారని చెబుతున్నారు.
ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని చేయడంతో గేమ్ వల్లేనని అనుమానం
ఈ క్రమంలో వరుణ్ మెడకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని ఊపిరాడకుండా చేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో బ్లూవేల్ అలవాటు కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడా మరేమైనా కారణం ఉందా అని పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. పోలీసులు ల్యాప్టాప్ను పరిశీలిస్తున్నారు.
ఆట కాకుండా మరేమైనా కారణముందా అని దర్యాఫ్తు
వరుణ్ ఆత్మహత్యకు ఆటనే కారణమా లేక మరేదైనా ప్రేమ వ్యవహారం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారని తెలుస్తోంది. వరుణ్ సెల్ ఫోన్ ఆధారంగా అతను ఎవరితో ఎక్కువసేపు మాట్లాడేవాడు, అతని స్నేహితులు ఎవరు అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు.